ఐరాస, జూన్ 9: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా జీవన వ్యయం(రోజువారీ ఖర్చు) బాగా పెరిగిందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. వం దేండ్లలో ఇలాంటి సంక్షోభాన్ని చూడలేదని పేర్కొన్నది. దీన్ని తట్టుకొనే సామర్థ్యం ప్రజలకు లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ‘రష్యా-ఉక్రెయిన్ యుద్ధం-ప్రపంచంపై ప్రభావం’కు సంబంధించి యూఎన్ విడుదల చేసిన రెండో నివేదిక ఇది. ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచం మీద పెద్ద బండ ఎత్తేసిందని, ప్రజలు నలిగిపోతున్నారని యూఎన్ నివేదికలో పేర్కొన్నది. పెరుగుతున్న ఆహార, చమురు, ఎరువుల ధరలే ఆ రాయి అని తెలిపింది. ఎఫ్ఏవో ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఆహార ద్రవ్యోల్బణం 20.8% ఉన్న విషయాన్ని ప్రస్తావించింది. ‘యుద్ధం కారణంగా చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా రవాణా వ్యయం పెరిగింది. ఎరువుల ధరలు పెరిగాయి. ఆహార ఉత్పత్తి వ్యయం పెరిగింది. జీవన వ్యయం పెరిగింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ విషవలయంలోకి వెళ్తున్నది’ అని యూన్ పేర్కొన్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరుగుతున్న జీవన వ్యయం ఈ శతాబ్దపు గమనాన్ని నిర్ణయించే సవాళ్లని ఐక్యరాజ్య సమితి పేర్కొన్నది. ‘2021 తో పోలిస్తే 2022 చివరి నాటికి చమురు ధరలు రెట్టిం పు అవుతాయని అంచనా. గడిచిన 20 ఏండ్ల సగటుతో పోలిస్తే ఎరువుల ధరలు డబుల్ అయ్యాయి. సము ద్ర రవాణాఖర్చు మూడు రెట్లు పెరిగింది. మార్కెట్ల అస్థిరత్వం పెట్టుబడిదారులను వెనుకడుగు వేసేలా చేస్తున్నది’ అని పేర్కొంది. దీన్ని నివారించాలంటే యుద్ధం ఆగి రష్యా, ఉక్రెయిన్ నుంచి మళ్లీ ఎగుమతులు పెరగాలని పేర్కొన్నది. లేదంటే జీవన వ్యయ సంక్షోభం ఏండ్ల పాటు ఉండొచ్చని విశ్లేషించింది.