సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): ఒకవైపు నగరం నలువైపులా నాలుగు సూపర్స్పెషాలిటీ దవాఖానలను నిర్మిస్తున్న తెలంగాణ సర్కార్ వైద్యరంగంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలోని ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రాథమిక వైద్యాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో గ్రేటర్లోని వైద్య, ఆరోగ్యశాఖ అధికారి పోస్టులను ఆరుకు పెంచింది. మహానగరంలో 6జోన్లు ఉండగా ప్రతి జోన్కు ఒక వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని నియమించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీంతో నగరవాసులకు వైద్యసేవలు మరింత చేరువకానున్నాయి. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో మొత్తం 117 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సేవలందిస్తున్నాయి. అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే 92 ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు పనిచేస్తుండగా రంగారెడ్డి జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో 6, మేడ్చల్ జిల్లా జీహెచ్ఎంసీ పరిధిలో 20 పీహెచ్సీలు ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నాయి.
ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో ఉన్న పీహెచ్సీల్లో హైదరాబాద్ మినహా మిగిలిన పీహెచ్సీలు గ్రేటర్ పరిధిలో ఉన్నప్పటికీ సంబంధిత జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో సేవలందిస్తున్నాయి. అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి జోన్కు ఒక డీఎంహెచ్వోను నియమించనున్నారు. ఈ లెక్కన గ్రేటర్ పరిధిలో మొత్తం 6జోన్లు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న 117పీహెచ్సీలను ఆరు జోన్లకు విభజించడం వల్ల ప్రతి పీహెచ్సీపై సూక్ష్మ పర్యవేక్షణ ఉంటుందంటున్నారు వైద్యాధికారులు. దీని వల్ల ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించడంతో పాటు సేవలను మరింత విస్తరించే అవకాశాలు ఉంటాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.