కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 22 : కాలనీలు, బస్తీలలో, రోడ్డుపక్కన చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా మార్చాలని కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. శుక్రవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో ఐదు సర్కిళ్ల ఉప కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వందశాతం స్వచ్ఛతను సాధించే దిశగా ప్రత్యేక కార్యచరణతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
చెత్త తొలగింపు వాహనాలన్నింటినీ సమర్ధవంతంగా వినియోగించుకోవాలని.. కాలనీలు, బస్తీలలో, ప్రధాన రోడ్లలో తరచుగా చెత్త వేస్తున్న ప్రాంతాలపై దృష్టిసారించి ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలన్నారు. చెత్త తొలగింపు వాహనాలను నిర్ణీత ట్రిప్పులు (3) ప్రతిరోజు ఉండేలా పర్యవేక్షణ చేయాలని, ప్రతీ వాహనం వెంబడి నలుగురు కార్మికులు ఉండేలా చూడాలని లేనిపక్షంలో కాంట్రాక్టర్కు పెనాల్టీ విధించాలన్నారు.
చెత్త తొలగింపు వాహనాలను షిఫ్టుల వారీగా వాడుకోవాలని ఆదేశించారు. ఎస్ఆర్పీలు, ఎన్విరాల్మెంట్ ఇంజినీర్ల సేవలను సరిగా వినియోగించుకోవాలన్నారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి కొత్తగా ఏర్పడిన కాలనీలలో స్వచ్ఛ ఆటోలు ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలన్నారు. సర్కిళ్ల వారీగా కొత్తగా కేటాయించిన స్వచ్ఛ ఆటో లబ్ధిదారుల వివరాలను నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. సర్కిళ్ల వారీగా ట్రిప్ కార్ట్ వాహనాలను వినియోగించుకోవాలని, పారిశుధ్యం విషయంలో ప్రజలనుంచి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు.
కాలనీలు, బస్తీలలో చెత్తాచెదారాన్ని సక్రమంగా తొలగిస్తున్నారా లేదా.? అని తెలుసుకునేందుకు సర్కిళ్ల వారీగా ఇన్చార్జి ఆఫీసర్లను నియమించాలని ఆదేశించారు. కూకట్పల్లి జోన్ కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరించేందుకు కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సర్కిళ్ల వారీగా ఇన్చార్జి ఆఫీసర్లు కాలనీలు, బస్తీల అధ్యక్ష కార్యదర్శులకు ఫోన్లు చేసి చెత్త కుప్పలను తొలగించారా, వీధి దీపాలు వెలుగుతున్నాయా, మాన్హోల్స్ మూతలు ఉన్నాయా, నిర్మాణ వ్యర్థాలు ఉన్నాయా, క్యాచ్ఫీట్లలో వ్యర్థాలు ఉన్నాయా.? అన్న అంశాలు తెలుసుకోవాలన్నారు.
ప్రజల ఫిర్యాదులను నమోదు చేసి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీనికోసం సర్కిళ్ల వారీగా ఇన్చార్జి ఆఫీసర్లు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఉప కమిషనర్లు రవికుమార్, రవీందర్కుమార్, మంగతాయారు, ప్రశాంతి, నాగమణి, సీటీవో గోవర్దన్ గౌడ్, డిప్యూటీ సీటీవో శ్రీరాములు పాల్గొన్నారు.