కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 16: వినాయక విగ్రహాల నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన వెసులుబాటుతో చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేలా ఏర్పాట్లపై దృష్టిసారించారు. కొన్నేండ్లుగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న చెరువుల వద్ద ఈ యేడాది కూడా నిమజ్జనం చేయడానికి అవసరమైన ఏర్పాట్లపై చేస్తున్నారు. అధిక సంఖ్యలో వచ్చే చిన్న విగ్రహాలను కొలనులో నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడానికి క్రేన్లను ఏర్పాటు చేస్తూ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని ఐదు సర్కిళ్లలో వినాయక నిమజ్జన వేడుకలు ఏర్పాట్లపై అధికారులు దృష్టినిసారించారు. కూకట్పల్లి జోన్లో 8 ప్రధాన చెరువులను గుర్తించగా.. విగ్రహాల నిమజ్జనాల కోసం 18 క్రేన్లు, 7 ఇటాచీ వాహనాలు, 18 టిప్పర్లు, 6 జేసీబీలు, 6 మొబైల్ క్రేన్లు, 3 ట్రాలీ ట్రాక్టర్లను ఉపయోగించనున్నారు. సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. మూసాపేట రంగధాముని (ఐడీఎల్) చెరువుగట్టుపై 7 క్రేన్లు, 1 ఇటాచీ, 4 టిప్పర్లు, 1 జేసీబీ, సున్నం చెరువులో 2 క్రేన్లు, 1 ఇటాచీ, 3 టిప్పర్లతో పాటు 2 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు.కూకట్పల్లి సర్కిల్లోని హస్మత్పేట, అంబీర్ చెరువుల్లో 4 క్రేన్లు, 2 ఇటాచీలు, 5 టిప్పర్లు, 2 జేసీబీలు, కుత్బుల్లాపూర్ సర్కిల్లో వెన్నెలగడ్డ చెరువు వద్ద 1 క్రేన్, 1 ఇటాచీ, 2 టిప్పర్లను అందుబాటులోకి తేనున్నారు. గాజులరామారం సర్కిల్లోని పరికిచెరువు, లింగం చెరువులలో 2 క్రేన్లు, 2 ఇటాచీలు, 3 టిప్పర్లు, 2 జేసీబీలు, 3 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేయనున్నారు. అల్వాల్ సర్కిల్లోని కొత్త చెరువు వద్ద 2 క్రేన్లు, 1 టిప్పర్, 2 ట్రాక్టర్లను అందుబాటులోకి తెచ్చి నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
వినాయక నిమజ్జన వేడుకల్లో పరిసరాల పరిశుభ్రతకు ప్రాముఖ్యతనిస్తున్నారు. చెరువుల్లో నిమజ్జనం చేసే విగ్రహాలతో తెచ్చే పూలు, ఇతర వ్యర్థాలను చెరువుల్లో వేయకుండా ప్రత్యేక బాక్సుల్లో వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. చెరువులో నిమజ్జనం చేసిన విగ్రహాలను ఎప్పటికప్పుడు తొలగించడం, చెరువు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవడం, కొవిడ్ నేపథ్యంలో శానిటైజర్, ఫాగింగ్పై ప్రత్యేక దృష్టిని సారించారు. చెరువుగట్లపై మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు, రాత్రి వేళల్లో నిమజ్జనాలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, భక్తులకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించడం, అత్యవసర వైద్య సేవలకోసం సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
నవరాత్రోత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి. నిమజ్జనానికి భక్తులు బాధ్యతగా అధికారులకు సహకరించాలి. నిమజ్జనం కోసం చెరువుల వద్ద అన్ని రకాల ఏర్పాట్లను పకడ్బందీగా చేస్తున్నాం. చెరువుల్లో అన్ని రకాల విగ్రహాలను పగలు, రాత్రి నిమజ్జనం చేసేలా ఏర్పాట్లు చేస్తాం. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేశాం. పూజా వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపడుతున్నాం. – వి.మమత, జడ్సీ, కూకట్పల్లి