మియాపూర్ , సెప్టెంబరు 2 : విధి నిర్వహణలో పాల్గొనే కార్మికుల రక్షణ తమకు ఎంతో ప్రధానమని, వారికి శాఖ తరపున అన్ని రక్షణ చర్యలను తీసుకుంటు న్నామని జోనల్ కమిషనర్ మమత అన్నారు. కరోనా, దోమల వ్యాప్తి నేపథ్యంలో సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లను అందిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఆమె తెలిపారు. కూకట్పల్లి జోన్ ఎంటమాలజీ సిబ్బందికి జోనల్ కార్యాలయంలో గురువారం విధి నిర్వహణకు తోడ్పడే వ్యక్తిగత కిట్లను బోర్డు ఎంటమాలజీ అధికారి డాక్టర్ రాంబాబు, డీసీ రవీందర్కుమార్తో కలిసి జడ్సీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జడ్సీ మాట్లాడుతూ కార్మికుల భద్రతకు ప్రభుత్వం తగిన ప్రాధాన్యతనిస్తున్నదని, వారు ఆరోగ్యంగా ఉంటేనే విధి నిర్వహణలో సమర్థంగా పని చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. కరోనా పరంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తూనే సీజనల్ వ్యాధుల బారిన పడకుండా కిట్లను వినియోగించుకుంటూ బాధ్యతలను నిర్వహించాలన్నారు. 11 రకాల వస్తువులతో రూ. 6,700 విలువైన కిట్ను ప్రతి ఒక్కరికీ అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆయా సర్కిళ్ల ఎంటమాలజిస్ట్లు, సూపర్వైజర్లు , సిబ్బంది పాల్గొన్నారు.