కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 24 : కూకట్పల్లి జోన్ ఐదు సర్కిళ్ల పరిధిలోని 86 కాలనీల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జడ్సీ మమత తెలిపారు. మంగళవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్లో డీసీలతో జడ్సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, గాజులరామారం, అల్వాల్ సర్కిళ్లలో కరోనా వ్యాక్సినేషన్ సర్వేను నిర్వహించి ఇప్పటి వరకు కరోనా టీకా వేయించుకోని వారి వివరాలను సేకరించామన్నారు. రెండ్రోజులుగా ఎంపిక చేసిన కాలనీల్లో ఇంటి వద్దకే వెళ్లి కరోనా టీకా వేసే కార్యక్రమాన్ని ప్రారంభించగా ఇప్పటికే 10768 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు.
మొదటి డోస్ 9481 మందికి, రెండోడోస్ 1287 మందికి వేసినట్లు ప్రకటించారు. కూకట్పల్లి జోన్లో 294 కాలనీలు ఉండగా ఇప్పటికే 86 కాలనీల్లో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. మూసాపేటలో 20 కాలనీలు, కూకట్పల్లిలో 22 కాలనీలు, కుత్బుల్లాపూర్లో 15 కాలనీలు, గాజులరామారంలో 15 కాలనీలు, అల్వాల్లో 13 కాలనీలు ఉన్నట్లు తెలిపారు. గడువు మరో ఏడ్రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో మిగిలిన కాలనీలన్నింటిలో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జోన్ పరిధిలోని ప్రతి ఇంట్లో వ్యాక్సినేషన్ సర్వే చేయాలని సిబ్బందిని జడ్సీ మమత ఆదేశించారు. ప్రత్యేక బృందాలు కాలనీలు, బస్తీల్లో తిరుగుతూ కరోనా టీకా వేయించుకోని వారి వివరాలను సేకరించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేయించాలని దీనిపై కాలనీలు, బస్తీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ప్రజా ప్రతినిధులు, కాలనీ, బస్తీల సంక్షేమ సంఘాల నాయకులతో ప్రజలందరికీ టీకాలు వేయించేలా చూడాలన్నారు. జోన్ పరిధిలో ప్రతిరోజూ 22 మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ల ద్వారా ప్రజలకు ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీసీలు రవికుమార్, రవీందర్కుమార్, మంగతాయారు, ప్రశాంతి, నాగవేణి, ఏంఎహెచ్వోలు పాల్గొన్నారు.
ఇంటింటికీ కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్లో రెండు కాలనీల్లో వందశాతం కరోనా టీకా వేయడం జరిగిందని డీసీ రవికుమార్ తెలిపారు. మంగళవారం సర్దార్పటేల్నగర్, భగత్సింగ్నగర్ ఫేజ్-2 లలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికీ కరోనా టీకా వేసినట్లు నిర్ధారిస్తూ ఆ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్ నేతలకు సర్టిఫికెట్లను అందజేశారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సాయిబాబా ఉన్నారు.
ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని బాలాజీనగర్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు అన్నారు. మంగళవారం డివిజన్లోని రెయింబోవిస్తాస్ అపార్ట్మెంట్లో వందశాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన సందర్భంగా అసోసియేషన్ సభ్యులకు అధికారులతో కలిసి సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి మధుసూదన్రెడ్డి, డీఈ శ్రీదేవి, కిరణ్, శారద తదితరులు ఉన్నారు.
కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం కేపీహెచ్బీ కాలనీ సర్దార్పటేల్నగర్లో చేపట్టిన ఇంటింటికీ కరోనా టీకా కార్యక్రమాన్ని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ కె.రవికుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మందలపు సాయిబాబా చౌదరి, ఎస్ఎస్ మురళీధర్రెడ్డి, డాక్టర్ పూజారెడ్డి, రమేశ్, శ్రీనివాస్, సర్దార్పటేల్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.