‘అగ్నిపథ్’ను తక్షణమే రద్దు చేయాలి
సైన్యంలో తాత్కాలిక నియామకాలు వద్దు
నాలుగేండ్ల తర్వాత మేమేం చేయాలి
పాత పద్ధతి ద్వారే ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టాలి
ఓపిక నశించే ఆందోళనకు దిగాం
పరీక్ష నిర్వహించే వరకు పోరు ఆగదు
ఆర్మీ ఉద్యోగార్థుల స్పష్టీకరణ
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము ఆర్మీలో చేరి.. దేశ సేవకు తమ జీవితాలు అంకితమవ్వాలని కోరుకుంటున్నామని, మా ఆశయాలను నాలుగేండ్లకే పరిమితం చేయడం తగదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. రేయింబవళ్లు కష్టపడి ఈవెంట్స్లో ఉత్తీర్ణత సాధించామని, కేంద్రం అనాలోచిత నిర్ణయం తమకు ఆశనిపాతంలా మారిందని మండిపడ్డారు. తమ మనోవేదనను ‘నమస్తేతెలంగాణ’తో పంచుకున్నారు. తమ బాధను కేంద్రానికి తెలియజేసేందుకే నిరసన చేపట్టామని చెప్పారు. భవిష్యత్ లేని స్కీమ్ను రద్దు చేయాల్సిందేనని, పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని కోరారు. ‘అగ్ని’ పరీక్ష పెట్టి.. యువత జీవితాలతో ఆటలాడొద్దని వేడుకున్నారు.
‘దేశ సేవ చేయాలనే ఆర్మీలో చేరాలనుకున్నాం. రాత్రింబగళ్లు కఠోర శ్రమ చేశాం. కఠినమైన ఫిజికల్ పరీక్షల్లో నెగ్గినాం. వైద్య పరీక్షలు కూడా పూర్తయి ఫిట్నెస్ సాధించాం. రెండేండ్లు దాటింది. కరోనా పేరు చెప్పి కాలయాపన చేశారు. ఉద్యోగ అర్హత వయసు దాటిపోతోంది. ఎనిమిది సార్లు పరీక్షలను వాయిదా వేశారు. ఎన్నో విజ్ఞప్తులు చేసినా ఆర్మీ అధికారులు పట్టించుకోలేదు. ఓపిక లేకే ఆందోళనకు దిగాల్సి వచ్చింది. మా కలల్ని కల్లలు చేయకండి. తల్లిదండ్రులు మాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్’ నాలుగేండ్ల నియామక విధానాన్ని రద్దు చేయాలి. దీనివల్ల యువత ఉద్యోగావకాశాలు కోల్పోతారు. నాలుగేండ్ల తర్వాత మాకు ఎవరు ఉపాధి కల్పిస్తారు ? మా జీవితాలతో కేంద్రం ఆటలాడుతోంది. పాత నియామక విధానాన్నే కొనసాగించాలి. పరీక్ష నిర్వహించే వరకు పోరాటం ఆపం’ అని ఆర్మీ ఉద్యోగార్థులు స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ స్టేషన్లో అగ్నిపథ్పై ఆందోళనపథం
మంటల్లో బోగీ
క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తున్న సహ అభ్యర్థులు
పాతపద్ధతిలోనే రిక్రూట్మెంట్ జరపాలని నినదిస్తున్న యువకులు
మోదీ జీ.. పొట్టలు కొట్టే కుట్రలొద్దు
మా బతుకులు నాశనం
టూర్ ఆఫ్ డ్యూటీ విధానంతో మా బతుకులు నాశనమవుతాయి. మా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మమల్ని చదివించారు. ఆర్మీ ఉద్యోగం సాధించాలనే పట్టదలతో కష్టపడి చదివాం. అగ్నిపథ్ స్కీంను విరమించుకోవాలి. పాత పద్ధతినే కొనసాగించి పరీక్షను నిర్వహించాలి. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు.
–వెంకటేశ్, మహబూబ్నగర్.
నాలుగేండ్లకే పరిమితం చేయొద్దు
సైన్యం మన దేశానికి గర్వకారణం. మేము మా జీవితాలు దేశ సేవకే అంకితమవ్వాలని కోరుకుంటున్నాం. మా కలలను నాలుగేండ్లకే పరిమితం చేయడం సరికాదు. రెండేండ్లుగా ఆర్మీ రిక్రూట్మెంట్ లేకపోవడంతో చాలా నిరుత్సాహంగా ఉన్నాం. ఇప్పుడు అగ్నిపథ్ తీసుకొచ్చి మా జీవితాలు బుగ్గిపాలు చేయాలని చూడటం సరికాదు. –పాండు, కామారెడ్డి
ఖర్చులు తగ్గించుకునేందుకే..
రెండేండ్ల నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగలేదు. సైన్యంలో చేరాలనే ఎన్నో కలలు కన్నాం. అందుకు ఎంతో కష్టపడి ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యాం. అగ్నిపథ్ స్కీం ద్వారా నిరుద్యోగులమైన మాకు అగ్ని పరీక్ష పెట్టొద్దు. ఈ పథకంతో మేమంతా అసంతృప్తిగా ఉన్నాం.దీని ద్వారా మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు.ఖర్చులు తగ్గించుకునేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ డ్రామా ఆడుతున్నది.
–లక్ష్మీనరసింహ, అమీర్పేట
మా బాధ తెలియాలనే..
2021లో హకీంపేటలో ఈవెంట్స్ని పూర్తి చేశా. 16 నెలలుగా రిక్రూట్మెంట్ కోసం వేచి చూస్తున్నా. కొంతకాలమైతే మేం ఆర్మీకి అనర్హులమవుతామనే భయంతో మా బాధ తెలియజేసేందుకే నిరసన తెలిపాం.
– రాకేశ్, కొమురం భీమ్ జిల్లావాసి.
నాలుగేండ్ల తర్వాత మా పరిస్థితి ?
అగ్నిపథ్తో ఎలాంటి ఉపయోగం లేదు. దాని సర్వీస్ నాలుగేండ్లు మాత్రమే. ఇంత కష్టపడి జాబ్ సంపాదిస్తే నాలుగేండ్లకే సర్వీస్ పూర్తయితే మా పరిస్థితి ఏమిటీ.? అగ్నిపథ్ను పూర్తిస్థాయిలో రద్దు చేసి..యథాతధంగా ఆర్మీ రిక్రూట్మెంట్ నిర్వహించాలి.
– లవకుమార్, మహబూబ్నగర్ జిల్లావాసి.
వెనక్కి తగ్గాలి..
మా బాధను కేంద్రానికి తెలియాలనే ఉద్దేశ్యంతోనే నిరసన చేపట్టాం. ఇప్పటికైనా కేంద్రం వెనక్కి తగ్గి సాధారణ నియామకాలను చేపట్టి మాకు దేశానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలి. సుమారు 500 మంది వరకు నిజామాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాం.
– అభిరామ్, నిజామాబాద్
ఎనిమిదిసార్లు రద్దు చేశారు
కేంద్ర ప్రభుత్వం దృష్టికి మా గోడు వెళ్లాలనే ఆందోళనకు దిగాం. ఇప్పటివరకు ఎనిమిదిసార్లు పరీక్షలను పెడుతామని చెప్పి రద్దు చేశారు. మాకు రోజు రోజుకు కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం పోతున్నది.
– హరీశ్, హన్మకొండ
పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలి
అగ్నిపథ్ ఎవరికీ ఉపయోగం లేదు. దీర్ఘకాలిక సర్వీస్ల నియామకాలు పెడితేనే బాగుంటుంది. అందుకే ఇది వరకు ఏ పద్ధతి ద్వారా రిక్రూట్మెంట్ చేశారో అదే విధానంతో అనుసరించాలి. అందరూ అగ్నిపథ్ను వ్యతిరేకిస్తున్నారు.
– సాయికుమార్, హన్మకొండ
ఈవెంట్స్లో పాసైనా..
2021 లో హకీంపేటలో జరిగిన ఈవెంట్స్లో అర్హత సాధించా. రెండేండ్ల నుంచి ఆర్మీ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు కొత్తగా అగ్నిపథ్ స్కీం ప్రవేశ పెట్టి మా జీవితాలతో ఆడుకుంటున్నారు. టీవోడీ రద్దు చేసి పరీక్షలు నిర్వహించాలి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగిస్తాం. – గణేశ్, నాగర్కర్నూలు
ఎన్నో ఆశలు పెట్టుకున్నాం..
నేను ఆర్మీ శిక్షణ ఈవెంట్స్లో ఎంపికై.. రెండేండ్లు అవుతున్నది. అప్పటి నుంచి పరీక్ష నిర్వహించలేదు. రేయింబవళ్లు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఈవెంట్స్లో పాసయ్యాం. ఇప్పుడేమో పరీక్ష రద్దు చేసి అగ్నిపథ్ స్కీం తీసుకొస్తామని ప్రకటన చేస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎగ్జామ్ నిర్వహిస్తే ఉత్తీర్ణత సాధించి.. జాబ్ కొడతామనే ఆశ ఉండేది. ఈ స్కీంలో మా వయస్సు పరిమితిమించి పోయిన కారణంగా మేము అర్హులం కాము. అగ్నిపథ్ను రద్దు చేసి పరీక్ష నిర్వహించాలి.
– రమేశ్, నాగర్ కర్నూలు