వయసుకు మించిన మనసుతో వినూత్న ఆలోచనలతో యువత సామాజిక సేవలో భాగస్వామ్యమవుతున్నది. ఓ వైపు తమ బాధ్యత నిర్వర్తిస్తునే మరోవైపు సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగ బాధ్యతలో ఉంటూ.. కూడా సామాజిక సేవలో పాలుపంచుకుంటూ.. అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. దేశ అభివృద్ధికి యువతే కీలకమని చెప్పిన స్వామి వివేకనంద జయంతి సందర్భంగా నగరానికి చెందిన కొందరు యువతుల సామాజిక సేవపై ‘నమస్తే’ ప్రత్యేక కథనమిది.
-సిటీబ్యూరో, జనవరి 11 (నమస్తే తెలంగాణ)
ఈమె పేరు దుర్గా కల్యాణి. సామాజిక సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐటీ రంగంలో కీలక హోదాలో ఉన్న ఆమె సేవా దారిలోకి రావాలనుకున్నారు. స్నేహితుల సహకారంతో ప్రతీ వీకెండ్ నిరుపేద విద్యార్థుల కోసం పుస్తకాలు, బ్యాగులు కొనుగోలు చేసి పంపిణీ చేశారు. అనంతరం ఆ సేవను మరింత మందికి చేర్చాలనే ఉద్దేశంతో జగతి ఫౌండేషన్ను స్థాపించారు. చదువులో రాణించే విద్యార్థులకు స్కూల్ ఫీజులు చెల్లించడం, గృహిణిలకు స్వయం ఉపాధిలో భాగంగా కుట్టు మిషన్ శిక్షణ అందించడం.. తదితర సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. అంతేకాదు సేవనే తన లక్ష్యంగా మలుచుకున్నారు. అందుకోసం ఏడాదికి రూ. 30 లక్షల ప్యాకేజీని వదులుకొని పూర్తిగా సేవలో ఉండిపోయారు. భర్త ఉద్యోగి కావడం, స్నేహితులు అండగా నిలవడంతో కల్యాణి సేవకే జై కొట్టారు.
ఈమె పేరు పావని. తాను చదువుకునే రోజుల్లో అనేక ఆకలి బాధలను ఓర్చుకున్నారు. ఇప్పుడు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. తాను చిన్నతనంలో పడ్డ ఆకలి బాధ.. ఇంకెవ్వరిని బాధించొద్దనే ఉద్దేశంతో తన జీతం డబ్బులతో ప్రతీ ఆదివారం అన్నార్తులకు అన్నం పెడుతున్నారు. క్రమం తప్పకుండా ఇప్పటి వరకు 243 ఆదివారాలు అన్నం పెట్టడం విశేషం. ప్రతీ పండుగ రోజుల్లోనూ రోడ్ల వెంట ఉన్న అభాగ్యులకు పండ్లు, ఆహార ప్యాకెట్లు అందిస్తున్నారు.
ఈమె పేరు రినా హిండొక. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు విభిన్న రకాల సామాజిక కార్యక్రమాలతో ఆదర్శంగా నిలుస్తున్నారు. టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్తో బస్తీల్లోని నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. చదువులో రాణించే విద్యార్థులకు ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అందిస్తున్నారు. విద్యకు దూరంగా ఉన్న పిల్లలను తిరిగి బడిలో చేర్పించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. తల్లిదండ్రులకు చదువుపై అవగాహన కల్పిస్తున్నారు. బాగా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు సైతం చూపిస్తుండటం విశేషం.
ఈమె పేరు హర్షిణి. ఫ్యాషన్ రంగానికి చెందిన వ్యక్తి. అనేక సినిమాల్లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే కేవలం తమ లక్ష్యం కోసమే కాకుండా ఇతరులకు మేలు జరిగేలా కార్యక్రమాలు చేపట్టడం ఇష్టంగా పెట్టుకున్నారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీకి అండగా ఉన్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలను నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ వర్గానికి చెందిన నిరుపేదలకు ఆర్థిక సమస్యలు తీర్చుతూ అండగా నిలుస్తున్నారు.