ఖైరతాబాద్, మే 14: జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి ఓ యువకుడు నిండు ప్రాణాలు కోల్పోయాడు. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఆనంద్నగర్కాలనీ నాసర్ స్కూల్ సమీపంలోని నాలాలో గుర్తు తెలియని ఓ యువకుడు చెత్త, వ్యర్థాలలో కూరుకుపోయి ఉన్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతి కష్టం మీద వ్యర్థాల మధ్యలోనుంచి అతడిని బయటకు తీయగా..
అప్పటికే అతడు మృతి చెందినట్టు గుర్తించారు. వ్యర్థాల కోసం దిగి, అందులో కూరుకుపోయి మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి చేతిపై రాజు, సునీత, రాధా, సిరివెన్నల అని పచ్చబొట్టు ఉంది. నల్లరంగు జీన్స్, షర్టు ధరించిన ఈ యువకుడి వయస్సు సుమారు 35 ఏండ్లు ఉంటుందని, ఆచూకీ తెలిసిన వారు పోలీసు స్టేషన్లో సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖాన మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వారం రోజుల కిందట గ్రేటర్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆనంద్నగర్ కాలనీలోని నాసర్ స్కూల్ సమీపంలో ఉన్న ఈ నాలాలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయి. జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ వ్యర్థాలను తొలగించలేదు. నాలా అడుగు నుంచి 15 అడుగుల ఎత్తు వరకు వ్యర్థాలు పేరుకుపోయాయి. వ్యర్థాల కింద ఉన్న నీరు కనిపించకపోవడంతో ప్రమాదవశాత్తు యువకుడు నాలాలో పడి మృతి చెంది ఉంటాడని, జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.