సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతుండడంతో రాగల మూడు రోజులు గ్రేటర్లోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్లో హెచ్చరికలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 34.8, కనిష్ఠం 23.7 డిగ్రీలు, గాలిలో తేమ 64శాతంగా నమోదైనట్లు వివరించారు.