హైదరాబాద్ : జులై 5న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బుధవారం అమీర్పేట డివిజన్ లోని బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి కల్యాణం నిర్వహణ, ఏర్పాట్ల పై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ముందుగా కల్యాణం సందర్భంగా అమ్మవారికి సమర్పించనున్న చీర తయారీ పనులను ఆలయ ఆవరణలో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆలయం వెనుక భాగంలో భక్తుల వసతి కోసం 3.20 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 5 వ తేదీన అమ్మవారి కల్యాణం, 6న రథోత్సవం నిర్వహిస్తారని తెలిపారు.
అమ్మవారి కల్యాణాన్ని ఆలయం ముందు నిర్మించిన రేకుల షెడ్డు కింద గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. అమ్మవారి కల్యాణానికి వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
అమ్మవారి కల్యాణాన్ని వివిధ ప్రాంతాలలోని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలలో వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. దర్శనం సమయంలో భక్తులు తోపులాటకు గురికాకుండా పటిష్టమైన బారీ కేడ్లను ఏర్పాటు చేస్తున్నామని వివరాలను వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలను సమన్వయం చేస్తూ పక్కాగా ఏర్పాట్లను చేస్తున్నామన్నారు.
సమావేశంలో కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆలయ ఈవో అన్నపూర్ణ, ఆలయ ట్రస్టీ సాయిబాబా గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట్, జోనల్ కమిషనర్ రవికిరణ్, స్ట్రీట్ లైట్ ఈఈ వెంకటేష్, వాటర్ వర్క్స్ ఈఎన్సీ కృష్ణ, జీఎం హరి శంకర్, పంజాగుట్ట ఏసీఈ గణేష్, తదితరులు పాల్గొన్నారు.