‘ఈ ఆలయం మాది. ఈ రాష్ట్రం మాది. ఈ ఆధ్యాత్మిక సంపద మాది అన్న గొప్ప భావన యావత్ తెలంగాణ ప్రజానీకం కలిగి ఉండాలి.’ – యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభ ముహూర్తం ప్రకటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సందేశమిది.
21వ శతాబ్దపు మహాద్భుతం. యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న మన ఆధ్యాత్మిక వైభవం.. యాదాద్రి దివ్యక్షేత్రం. అపర వైకుంఠాన్ని తలపించేలా రూపుదిద్దుకున్న ఈ పంచ నారసింహ క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యానికి త్రిదండి చినజీయర్స్వామి పర్యవేక్షణలో ముహూర్తం ఖరారైంది. 2022 మార్చి 28న మహా కుంభ సంప్రోక్షణతో ఆలయాన్ని పునః ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. యాదాద్రిలో మంగళవారం పర్యటించిన సీఎం.. దాదాపు 8గంటలపాటు అలుపెరుగకుండా ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. తుది దశ పనులపై అధికారులకు సలహాలు, సూచనలు అందించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. అర్చక బృందం పూర్ణకుంభ స్వాగతం పలికి ఆశీర్వచనం అందించింది. అనంతరం ఎనిమిది గంటల పాటు సీఎం కేసీఆర్ అణువణువునా పనులను పరిశీలించి మహా కుంభసంప్రోక్షణ నాటికి పూర్తి చేయాల్సిన పనులపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
మహోత్కృష్ణమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో, తెలంగాణలో చాలా విశిష్టమైనది, ప్రముఖమైనది.. స్వయంభువుగా వెలిసినటువంటి శ్రీ యాదగిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం. నేనెప్పుడో యాభై ఏండ్ల క్రితం.. చాలా చిన్నగ ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి మా కుటుంబ సభ్యులతోని రావడం జరిగింది. మెట్లగుండానే స్వామివారి దర్శనం చేసుకుని, ఆ అదృష్టం పొందిన.
యాదగిరిగుట్ట ఒకప్పుడు కరువుకు ఆలవాలంగా ఉన్న పరిస్థితి. మంచినీళ్లకూ బాధపడ్డ పరిస్థితి. స్వామివారి సన్నిధిలో నృసింహ సాగర్ నిర్మాణం పూర్తికావస్తున్నది. స్వామిని అభిషేకించడానికి, భక్తుల పుణ్యస్నానాలకు కూడా పుణ్య గోదావరి జలాలు అందే అదృష్టం మనకు దక్కింది. స్వామివారి పాదాలను స్పృశిస్తూ.. ఆలేరు, భువనగిరి, నకిరేకల్ నియోజకవర్గంలో ఐదున్నర లక్షల ఎకరాల్లో అద్భుతమైన పంటలు పండించనున్నది.
యాదాద్రికి వస్తే గతంలో ఉండేందుకు స్థలం లేదనే బాధ ఉండేది. నేడు టెంపుల్ సిటీ నిర్మాణం చేపట్టినం. పెద్దలు, ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని, రెండు మూడు రోజులు కుటుంబంతో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. భక్తుల కోసం ధర్మశాలలు అందుబాటులో ఉన్నాయి. టెంపుల్ సిటీలో ఫస్ట్ ఫేజ్ లేఅవుట్లో 250 అద్భుతమైన కాటేజ్లు నిర్మిస్తాం.ఆలయ ప్రారంభోత్సవం తరువాత వసతుల పరంగా నిరంతరాయంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తాం. జిల్లా మంత్రి జగదీశ్రెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిరంతరాయంగా పనులను పర్యవేక్షిస్తారు.
రాష్ట్రంలో రెండో అతి పెద్ద రిజర్వాయర్ మల్లన్నసాగర్ నుంచి నృసింహ(బస్వాపుర్) రిజర్వాయర్కు గోదావరి నీళ్లను తరలించి యాదాద్రిని సందర్శించుకునే భక్తులు నిత్యం గోదావరి నీళ్లతో పుణ్యస్నానం ఆచరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నిరంతరం స్వామి వారి పాదాలను స్పృశించే ఈ జలాలు యాదాద్రి జిల్లాలోని భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు నకిరేకల్ నియోజకవర్గాల్లోని 5.50 లక్షల ఎకరాలకు నీరందించే మహాభాగ్యం కలగబోతున్నది.