బన్సీలాల్పేట్ : న్యూబోయిగూడలోని సమ్మక్క, సారలమ్మ దేవాలయంలో మూడు రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే మేడారంలో అమ్మవార్లిద్దరూ వనం నుండి గద్దెలపై వచ్చి కొలువుదీరి, భక్తులకు దర్శనం ఇచ్చాక, తిరిగి వనప్రవేశం జరిగే వరకు ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నదని నిర్వాహకులు మక్కల కుమార్, ప్రమీల, సంజీవ్లు తెలిపారు.
అమ్మవార్లకు బంగారం సమర్పించి, కల్లు సాకపోసి, కొత్త వస్త్రాలను సమర్పించి, ప్రత్యేకంగా పూజలు చేశామని వారు తెలిపారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా మేడారం వరకు వెళ్ళలేని వారికి బోయిగూడలోని దేవాలయంలో ఉన్న సమ్మక్క, సారక్కలు ఆశీర్వాదాలు అందిస్తున్నారని, భక్తులు కూడా నమ్మకంతో, భక్తితో అమ్మవార్లను కొలుస్తున్నారని వారు తెలిపారు.