తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు అన్నారు. కార్వాన్ నియోజకవర్గం గుడి మల్కాపూర్కు చెందిన పలువురు కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయాన్ని శనివారం జడ్జీల క్వార్టర్స్లో అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మరోసారి రుజువు అయ్యిందన్నారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి రూ.6.30 లక్షలు, సహజంగా మరణించిన వ్యక్తికి సంబంధించి రూ.1.30 లక్షలు, మ్యారేజ్ బెన్ఫిట్ కింద రూ.30 వేలు, ప్రసూతికి రూ.30 వేలను పలువురికి శనివారం అందజేశారు. కార్యక్రమంలో అథారిటీ స్పెషల్ సెల్ కార్యదర్శి జి.అనుపమా చక్రవర్తి, చౌహాన్, పురుషోత్తం రెడ్డి, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్యాంసుందర్ రాజు, ఏఎల్ఓ మంగూబాయి, సభ్యులు రామారావు, సరోజ తదితరులు పాల్గొన్నారు.