ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 21: మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ సహకారంతో ఓయూ సైన్స్ కళాశాలలో మంగళవారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. కానీ అనుకన్న స్థాయిలో పరిశోధనా రంగంలోకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పద్నాలుగు శాతం అమ్మాయిలు మాత్రమే పరిశోధనా రంగంలో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిశోధనలను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. కృత్రిమ ఇంటెలిజెన్స్ కోసం ప్రత్యేకించి ఒక ల్యాబ్ను సైతం ఏర్పాటు చేసిందన్నారు. దీనిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి జయరాజ్, ప్రొఫెసర్లు వీరయ్య, కరుణసాగర్, హిమబిందు, హమీదాబీ పాల్గొన్నారు.
‘సాంస్కృతిక’ సందడి
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 21: సాంస్కృతిక పోటీలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తాయని ఓయూ అధికారులు అన్నారు. మంగళవారం ఓయూ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలను ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియం, టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు ఇతర నైపుణ్యాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ఈ పోటీల్లో ఓయూ పరిధిలోని డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. ఇందులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారితో త్వరలో ప్రదర్శన ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దాంతో పాటు త్వరలో జరగనున్న సెంట్రల్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్కు పంపిస్తామని వివరించారు. ఈ పోటీలు బుధవారం కూడా కొనసాగుతాయన్నారు. కాగా, గ్రూప్ డ్యాన్సులు, శాస్త్రీయ నృత్యాలు, ,ఫోక్ డ్యాన్సులు.. గిరిజన సంస్కృతిని చాటే ప్రదర్శనలతో ఓయూ అంతర్ కళాశాలల సాంస్కృతిక పోటీలు ఆకట్టుకున్నాయి. జానపద, ట్రైబల్ గ్రూప్ డ్యాన్సులు, క్లాసికల్ డ్యాన్సులు, కొల్లేజ్, కార్టూనింగ్, క్లే మోడలింగ్, పోస్టర్ మేకింగ్, రంగోళి, స్పాట్ ఫొటోగ్రఫీ, ఆన్ ద స్పాట్ పెయింటింగ్, ఇన్స్టాలేషన్, క్లాసికల్ వోకల్ సోలో (హిందుస్తాని/కర్ణాటక), క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో(పర్క్యుషన్), క్లాసికల్ ఇన్స్ట్రుమెంటల్ సోలో (నాన్ పర్క్యుషన్) తదితర అంశాలలో విద్యార్థులు సత్తా చాటారు.