సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): మ్యాట్రిమోని ద్వారా పరిచయమైన మహిళలు, యువతులను పెళ్లి పేరుతో మోసగించి, కోట్ల రూపాయల కుచ్చుటోపీ పెడుతూ తప్పించుకు తిరుగుతున్న ఓ పాత నేరస్తుడిని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. క్రైమ్ డీసీపీ కె.నర్సింహా కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన పొట్లూరి శ్రీబాల వంశీకృష్ణ (37) పెళ్లి పేరుతో అమాయక మహిళలు, యువతులను మోసగించి, డబ్బులు సంపాదించాలని పథకం పన్నాడు. ఈ క్రమంలో షాదీ డాట్కామ్ మాట్రిమోని యాప్లో రూ.2,500 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిషికుమార్గా పేరు నమోదు చేసుకున్న నిందితుడు.. గ్లెన్మార్క్ ఫార్మా అసిస్టెంట్ డైరెక్టర్గా తన వ్యక్తిగత వివరాలను షాదీ డాట్కామ్లో పొందుపరిచాడు. అనంతరం పలువురు మహిళలు, యువతులకు పెళ్లిసంబంధం కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. నగరంలోని మదీనాగూడకు చెందిన ఒక మహిళ.. నిందితుడి ప్రొఫైల్కు స్పందించింది. ఈ క్రమంలో వాట్సాప్ ద్వారా బాధితురాలితో మాటలు కలిపిన నిందితుడు.. వివాహం తరువాత యూఎస్కు తీసుకెళ్తానని ఆమెను నమ్మించాడు. యూఎస్ పార్టన్ వీసా ద్వారా అమెరికాకు తీసుకెళ్లాలంటే సిబిల్ స్కోర్ కనీసం 845 ఉండాలని బుకాయించాడు.
అందుకోసం తాను పనిచేస్తున్న గ్లెన్మార్క్ కంపెనీ ద్వారా లోన్ ఇప్పిస్తానని చెప్పాడు. అది నమ్మిన మహిళ లోన్ తీసేందుకు అంగీకరించింది. అంతటితో ఆగకుండా సదరు మహిళ సమీప బంధువైన మరో యువతికి సైతం ఆస్ట్రేలియాలోని మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఆమెకు కూడా సిబిల్ స్కోర్ ఉండాలంటే లోన్ తీయాల్సి ఉంటుందని నమ్మబలికాడు. యువతిని నమ్మించేందుకు మైక్రో సాఫ్ట్వేర్ బోర్డ్ మెంబర్ పేరుతో నిర్మల అనే ఓ మహిళతో ఫోన్ ద్వారా మాట్లాడించాడు. నిందితుడి మాటలు నమ్మిన ఇద్దరు మహిళలు లోన్లు తీసేందుకు అంగీకరించారు. దీంతో ఇద్దరు మహిళలతో రూ.2,71,79,044 లోన్ తీయించి, తన బ్యాంకు ఖాతాలోకి మార్చుకున్నాడు. ఆ తరువాత నిందితుడు ముఖం చాటేయడంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత మహిళలు.. సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. అతడి వద్ద నుంచి 6 బ్యాంకుల పాస్బుక్లు, 10 క్రెడిట్ కార్డులు, 3 సెల్ఫోన్లు, 4 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 9 ఠాణాలలో ఇదే తరహా కేసులు నమోదైనట్లు డీసీపీ తెలిపారు.