వెంగళరావునగర్, సెప్టెంబర్ 3 : ఉపాధి ఇప్పిస్తామని.. ఉద్యోగాలు కల్పిస్తామన్న మాటలు నమ్మి వంచనకు గురై పడుపు వృత్తిలోకి పోయారు. మౌనంగా భరిస్తూ జీవితాన్ని భారంగా గడిపారు. అక్కడి నుంచి ఎలా బయటకు రావాలో తెల్వక.. ఎటు పోవాలో తెల్వక తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు అధికారులు, పోలీసుల చొరవతో బయటకొచ్చి చీకటి జీవితం నుంచి విముక్తి అయ్యారు. వారు తీవ్ర మనోవేదనకు గురికాకుండా సమాజంతో కలిసిపోయి స్వయం ఉపాధి పొందేందుకు మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ బాటలు వేస్తూ వారి ఉన్నతికి సహకరిస్తోంది.
పేదరికంలో కొట్టుమిట్టాడే అమ్మాయిలకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ కొన్ని ముఠాలు వారికి డబ్బులు, విలాసాలు ఆశచూపి నగరంలోని వ్యభిచార కేంద్రాలకు విక్రయిస్తున్నాయి. ఆయా ప్రాంతాలు తిప్పుతూ దొరకకుండా, బయటకురాకుండా కట్టడి చేస్తున్నాయి. నగరంలోని కొన్ని స్పా సెంటర్లు, బ్యూటీపార్లల్లో ఉద్యోగమని నమ్మించి క్రాస్ మసాజ్ సెంటర్లలో వ్యభిచారం చేయిస్తున్నాయి. అధికంగా డబ్బిస్తామని ఆశచూపి వ్యభిచార రొంపిలోకి మెల్లగా దింపుతారు. స్పై కెమెరాలతో రహస్యంగా చిత్రీకరించి యువతులను అడ్డం పెట్టుకుని వ్యాపారం సాగించే కొన్ని ముఠాలు ఇటీవల పోలీసులకు చిక్కాయి.
వెండితెరపై వెలిగిపోవాలని..సినిమా అవకాశాల కోసమని యత్నించి ఎంతకీ దొరక్క చివరకు వ్యభిచార ముఠాల చేతుల్లో చిక్కుకుంటున్నారు. పేదరికం, ఆకలితో మరికొందరు యువతులు ఈ రొంపిలోకి దిగుతున్నారు. మహిళల అక్రమ రవాణా, వ్యభిచార కేంద్రాల కార్యకలాపాలపై నిఘా పెంచిన పోలీసులు జిల్లాలతోపాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే దాడుల్లో యువతుల్ని కాపాడి కూకట్పల్లిలోని ప్రభుత్వ రెస్క్యూ హోంలో ఆశ్రయం కల్పిస్తున్నారు.
రెస్క్యూ హోంలోకి వచ్చిన యువతులకు మెరుగైన వైద్యమందిస్తారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు అందిస్తారు. మానసిక సమస్యలను నివారించేందుకు నిపుణుడితో కౌన్సెలింగ్ ఇప్పిస్తారు. వారు త్వరగా కోలుకొని ప్రశాంతత పొందేలా చేస్తారు. ఈ రెస్క్యూ హోంలో తెలంగాణ, ఏపీ, పశ్చిమబెంగాల్ చెందిన యువతులే కాకుండా ఉజ్బెకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలకు చెందిన 50 మంది యువతులు ఆశ్రయం పొందుతున్నారు.
స్వశక్తితో ఎదగాలని కమిషనర్ దివ్య దేవరాజన్ ఆదేశాలతో రెస్క్యూహోంలో ఉండే యువతులకు టైలరింగ్, జూట్ బ్యాగుల తయారీ, లెదర్బ్యాగులు, కుకింగ్, గార్డెనింగ్, టై అండ్ డై, పెయింటింగ్, వాల్ పెయింటింగ్,చీరలపై ఆర్ట్స్, గాజుల తయారీ వంటి 14 రకాల వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ కల్పిస్తున్నాం. స్టేట్హోం, బాలసదన్లోని పిల్లలకు అవసరమైన బట్టల్ని కూకట్పల్లి రెస్క్యూహోం యువతులు టైలరింగ్ చేసి కుట్టడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ పొందిన ఒక్కో యువతి నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేలు సంపాదిస్తున్నారు. – అక్కేశ్వర్రావు, జిల్లా సంక్షేమ అధికారి
ఇక్కడికొచ్చే యువతులంతా మా పిల్లలే. వచ్చిన తొలినాళ్లల్లో ఆందోళన ఉండేది. మేమిచ్చే కౌన్సెలింగ్, చూపే ఆప్యాయతతో దగ్గరయ్యారు. రాగానే వెల్కమ్ కిట్ అందిస్తాం. వృత్తి నైపుణ్యానికి సంబంధించిన కోర్సుల్లో వారి అభిరుచి మేరకు నేర్పిస్తాం. బిడ్డలు, కుటుంబీకులు, బంధువులతో ఫోన్లో మాట్లాడేందుకు అనుమతిస్తాం. కుటుంబీకులతో వెళ్లదల్చిన వారికి కుట్టుమిషన్, ముడి సామగ్రిని ఇస్తాం. తర్వాత కూడా వారిపై పర్యవేక్షణ ఉంటుంది. – నీలిమ, రెస్క్యూ హోం సూపరింటెండెంట్
తలెత్తుకొని గౌరవంగా బతకాలనుకుంటున్నాం. జీవితానికి రెస్క్యూ హోం అధికారులు భరోసా కల్పించారు. మేము బయటకు వెళితే బతకగలమన్న ధైర్యం కల్పించారు. నెలకు రూ.25 వేలకు పైగా సంపాదించుకోగలనన్న ధీమా ఇచ్చారు. అల్లికలు, కుట్టుమిషన్, ఎంబ్రాయిడరీ, బ్యాగులు, గాజుల తయారీ మాకెంతో ఉపయోగపడుతున్నాయి. ఆ చేదు జ్ఞాపకాలు, పాత జీవితానికి వీడ్కోలు పలికి..కొత్త జీవితంలోకి అడుగుపెడుతాం.