వెంగళరావునగర్ : మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధించగలరని తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం వెంగళరావునగర్ డివిజన్ జీటీఎస్ కాలనీలోని జెన్కో ,ట్రాన్స్ కో ఆడిటోరియంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన 217 మంది లైన్ ఉమెన్ లను సహచరమంత్రి జగదీష్ రెడ్డితో కలిసి కేటీఆర్ ఘనంగా సత్కరించారు.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తూ దేశంలోనే మొట్టమొదటిసారిగా 217 మంది జూనియర్ లైన్ ఉమెన్స్ ల నియామకం చేయడం గొప్ప విషయమని అన్నారు. లైన్ ఉమెన్ అనే పదాన్ని మార్చాల్సిన అవసరం ఉందని..లైన్ మానిటరో..మరేదైనా మంచి పేరు పెట్టాలని కేటీఆర్ విద్యుత్తుశాఖకు సూచించారు. లింగ వివక్షకు తావులేని సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యాలయంలో, ఇంట్లో మహిళలు కష్టపడి పనిచేస్తారని..పురుషులకు దీటుగా మహిళలు పనిచేస్తున్నారని ఆయన కితాబిచ్చారు. ట్రాన్స్ కో, జెన్కోలో ఇప్పటి వరకు 9,644 మందిలో 50 శాతం మహిళలు ఉద్యోగాలు సాధించడం గర్వకారణమన్నారు. పోలీసుశాఖలో 18వేల ఉద్యోగాల్లో మహిళలు 33 శాతం ఉద్యోగాలు పొందారని..కానీ విద్యుత్తుశాఖలో 50శాతం ఉద్యోగాలను మహిళలు సాధించుకోవడం హర్షించదగ్గ పరిణామమని పేర్కొన్నారు.
సమాజంలో మహిళల పట్ల కొనసాగుతున్న వివక్షను రూపుమాపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. సీఎం కేసీఆర్ విద్యారంగంలో బాలికా విద్యకు ప్రాధాన్యతనిస్తున్నారని.. మైనార్టీలకు చెందిన బాలికలు 18 నుంచి 42 శాతం విద్యావంతులు కావడం సంతోషంగా ఉందన్నారు. తాను హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో చదువుకున్నానని కేటీఆర్ తన బాల్య స్మతుల్ని నెమరువేసుకున్నారు.
విద్యతో ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకురాగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకరరావు, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ సునీల్ శర్మ, టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్సీడీసీఎల్ సీఎండి గోపాలరావు తదితరులు పాల్గొన్నారు.