చిక్కడపల్లి: మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ పై సమగ్ర సమీక్ష చేయాలని మహిళా, ట్రాన్స్జెండర్ సంఘాల ఐక్య కార్యచరణ వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 13న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఫేజ్, డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఏ)ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మహిళా, ట్రాన్స్జెండర్ సంఘాల ఐక్య కార్యచరణ వేదిక ఆధ్వర్యంలో మూసీ పరీవాహక ప్రజల హక్కుల కోసం సంఘీభావ సదస్సును గురువారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు.
డబ్ల్యూటీ జేఏసీ నేతలు మీరా సంఘమిత్రి, డాక్టర్ లుబన్న సర్వత్, డాక్టర్ ఉషా సీతాలక్ష్మి, సంధ్య,ఝాన్సీ తదితరులు మాట్లాడారు. ముసీ నది తీర ప్రాంతల్లో నివసిస్తున్న మహిళలు, శ్రామిక, మధ్యతరగతి కాలనీలకు చెందినవారే అని చెప్పారు. దేశ వ్యాప్తంగా పెద్ద ప్రాజెక్టుల వల్ల జరిగే నిర్వాసిత అనుభవాలు ఎప్పుడూ మహిళలే అత్యంత బాధను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర కాంగ్రెస్ పార్టీ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టను సమీక్షించాలన్నారు. భారీ స్థాయిలో ప్రజలను తరలించడం సరికాదని, రియల్ ఎస్టేట్ అభివృద్ధి ద్వారా మూసీ నదికి, పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు. మూసీ బాధితులకు అండగా ఉంటామన్నారు.