సందేశాత్మక పెయింటింగ్స్తో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టులు
ప్రకృతి నుంచి ఆధ్యాత్మికం వరకు పలు చిత్రాలు..
సిటీబ్యూరో, మే 26 (నమస్తే తెలంగాణ) : సామాజిక పరిస్థితులు, ప్రకృతి, యుద్ధాలు, శాంతి తదితర అంశాలపై సమాజాన్ని మేల్కొలిపే చిత్రాలన్నో… కళాకారుల కుంచె నుంచి జాలువారిన ప్రతీ పెయింటింగ్ ఓ సందేశాత్మకం. అట్లాంటి అద్భుత చిత్రాలను సందర్భానుసారంగా నిత్యనూతనంగా ఆవిష్కరిస్తున్నారు నగరానికి చెందిన కొంతమంది మహిళా ఆర్టిస్టులు. అనేక ఎగ్జిబిషన్లలో వారి చిత్రాలు ప్రదర్శనకు నోచుకుని ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రకృతి సౌందర్యాల నుంచి ఆధ్యాత్మికం వరకు ఉన్న అనేక చిత్రాలలో.. ప్రతి ఒక్క చిత్రం ప్రాణం పోసుకున్నదా అనిపించేలా దర్శనమివ్వడం విశేషం.
ప్రకృతి రూపం.. గాయత్రి..
నగరానికి చెందిన గాయత్రికి చిన్నప్పటి నుంచి పెయింటింగ్స్ వేయడం ఆసక్తి. తనకు తానుగానే ఎక్కువ మెళకువలు నేర్చుకుని పెయిటింగ్ కళాకారిణిగా ఎదిగింది. ఏదైనా వస్తువు, ప్రకృతిని చూసినప్పుడు తన మనసులో దాని రూపాన్ని భద్రపరిచి..పెయింటింగ్తో ప్రపంచానికి పరిచయం చేయడం అలవాటు. అందులో భాగంగానే నగరంలోని పలు ప్రాంతాల చిత్రాలు గీసి నగరవాసుల అభిమానాన్ని సంపాదించుకుంది.
మైథలాజికల్ ఆర్ట్స్తో అయేషా..
లక్ష్మి, కృష్ణుడు, వినాయకుడు ఇలా అన్ని దేవుళ్లు.. సజీవంగా దర్శనమిస్తున్నాయా… అన్నట్టుగా అద్భుతమైన ఆయిల్ పెయింటింగ్స్ను అయేషా వేశారు. మరోవైపు ముద్ర అనే అంశంపై అనేక రకాల ముద్రలను డ్యాన్స్ ఫామ్స్ ఆఫ్ ఇండియా సిరీస్ పేరుతో పెయింటింగ్ రూపంలో పొందుపర్చారు. ఈ ముద్రలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆరోగ్యంగా జీవించడానికి ఈ ముద్ర ఆసనాలు ఎంతగానో ఉపయోగపడుతాయని మేధావులు చెబుతున్నారు. అలాంటి రూపాలను పెయింటింగ్ రూపంలో అందరికి అర్థమయ్యేలా రూపొందించారు అయేషా. ఆమె మరో పెయింటింగ్ తారా లక్ష్మి అవతార్ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల కశ్మీర్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పాల్గొని ద్వితీయ బహుమతి గెలుచుకుంది.
సంప్రదాయ భారతీ..
ట్రెడిషనల్ ఆర్ట్లో తనదైన ముద్రవేస్తుంది భారతీకర్. డిజైనర్ హెడ్గా విధులు నిర్వర్తించిన ఆమెకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్పై ఆసక్తి. హైదరాబాద్లో ఆర్ట్కు నగరవాసుల నుంచి వస్తున్న ఆదరణ ఆమెను పెయింటింగ్స్ వైపునకు మరింత బలంగా నడిచేలా చేసింది. ఆమె వేసిన పెయింటింగ్స్లో కృష్ణుడి చిత్రం అందరినీ ఆకట్టుకుంది. మొక్కలు, పక్షులు, మహిళల అభ్యున్నతి తదితర అంశాలపై ఆమె అనేక పెయింటింగ్స్ వేశారు. అనేక ఎగ్జిబిషన్లలో పలు బహుమతులను గెలుచుకున్నారు. ఇటీవల సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ల పాల్గొని ప్రశంసలు అందుకుంది. ఇతర రాష్ర్టాల్లో జరిగే పెయింటింగ్ కాంపిటేషన్స్లో ఈమె పేరు కచ్చితంగా ఉండటం విశేషం.