Crime News | హిమాయత్నగర్, ఫిబ్రవరి 18: వివాహేతర సంబంధాలు పలువురి జీవితాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ఊహించని పరిణామాలకు, దారుణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి నారాయణగూడ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అడ్మిన్ ఎస్సై నరేశ్ కుమార్ కథనం ప్రకారం.. కర్ణాటకకు చెందిన గిరీష్, శివాలి (32) దంపతులు. వీరికి ఒక కుమారుడు(11), ఒక కుమార్తె (14)ఉన్నారు. ఈ కుటుంబం జీవనోపాధి కోసం నగరానికి వచ్చి హిమాయత్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆరేండ్లుగా ఇద్దరు వేర్వేరుగానే ఉంటూ జీవనం సాగిస్తున్నారు. శివాలి ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నది.
ఆమెకు రెండేళ్ల కిందట బేగంపేటలోని ఓ పబ్లో రాంకోఠికి చెందిన ఖాలీద్ (38) పరిచయమయ్యాడు. ఆ పరిచయం వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఖాలీద్కు భార్యా పిల్లలున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శివాలికి సహాయం చేశాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో అతడు శివాలి ఇంటికి కూడా వచ్చేవాడు. ఈ క్రమంలో ఆమె 14 ఏండ్ల కుమార్తెపై ఖాలీద్ కన్నుపడింది. తల్లి ఇంట్లోలేని సమయంలో అతడు ఇంటికి వచ్చి.. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధింపులకు గురి చేశాడు. ఈ విషయాన్ని బాలిక పలుమార్లు తల్లితో చెప్పింది.
గొడవలు కూడా జరిగాయి. ఈ పరిస్థితులతో తీవ్ర మనస్తాపం చెందిన శివాలి శనివారం సాయంత్రం పిల్లలు బయట ఆడుకుంటుండగా.. ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావించారు. అయితే, ఆమె కుటుంబం ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేయగా.. ఆమె ఆత్మహత్యకు వివాహేతర సంబంధం కారణంగా తేలడంతో ఖాలీద్ను అదుపులోకి తీసుకొని విచారించగా వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.