హైదరాబాద్ : హైకోర్టుకు సమీపంలోని పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి వద్ద ఓ బాలింత ఆత్మహత్యాయత్నం చేసింది. భర్తతో గొడవ పడిన ఆమె ఆస్పత్రిలోని మొదటి అంతస్తు నుంచి కిందకు దూకింది. బాలింత కిందకు దూకడాన్ని గమనించిన సెక్యూరిటీ సిబ్బంది.. ఆమెను పట్టుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. గాయపడిన బాధితురాలికి వైద్యులు చికిత్స అందించారు. ఐదు రోజుల క్రితం కవల పిల్లలకు సంపూర్ణ జన్మనిచ్చింది.
అయితే నిద్ర లేమితో బాధపడుతున్న బాలింత గురువారం ఉదయం తన భర్తతో గొడవ పడింది. గట్టిగా అరుస్తూ తాను చనిపోతానని బెదిరించింది. ఆ సమయంలో భర్త వారించడంతో బాలింత కాస్త నెమ్మదించింది. మళ్లీ సాయంత్రం సమయంలో మొదటి అంతస్తులోని కిటీకి నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.