జగద్గిరిగుట్ట, ఫిబ్రవరి 6 : తన కొడుకుకు ఆధార్ కార్డు ఇవ్వాలని వాటర్టాంకు పైకెక్కిన మహిళ దూకుతానంటూ బెదిరించగా పోలీసులు స్పందించి రక్షించారు. జగద్గిరిగుట్ట పోలీసుల వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట, వెంకటేశ్వరనగర్లో రాధిక(40).. తన పదేండ్ల కు మారుడితో కలసి నివాసం ఉంటుంది. ఒంటరి మహిళ అయిన ఆమె.. తరచూ తనకు అన్యాయం చేశారంటూ పలుమార్లు పోలీస్స్టేషన్ వచ్చి హడావుడి చేసేది. ఈనేపథ్యంలో గురువారం తన కుమారుడికి ఆధార్కార్డు ఇవ్వాలంటూ స్థానికంగా ఉన్న ఈ-సేవాకేంద్రానికి వెళ్లగా.. బర్త్సర్టిఫికెట్లు, ఇతర పత్రాలతో అఫ్లై చేయాలని అక్కడివారు సూచించారు. అవేవీ లేకుండా ఆధార్ ఇవ్వాలని వాదనకు దిగింది.
ఆపై కుమారుడిని వెంటపెట్టుకుని వేంకటేశ్వర ఆలయం పరిసరాల్లోకి వెళ్లింది. సమీపంలోని వాటర్ట్యాంకు పైకెక్కి దూకుతానని బెదిరించింది. అక్కడివారు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి రాగా వేలాడుతూ కనిపించింది. దీంతో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి రెయిలింగ్నుంచి పైకి లాగారు. పోలీస్స్టేషన్కు తరలించి మరోసారి ఇలాంటి ప్రయత్నాలు చేయవద్దని కౌన్సెలింగ్ ఇచ్చారు.