ఆలుమగలను విడదీసే యత్నం
కాసోజు శంకరమ్మ ఆరోపణ
మన్సూరాబాద్, జూన్ 6: తమ కుటుంబాన్ని విడదీసేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కుట్ర పన్నుతున్నాడని మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ ఆరోపించారు. తన భర్త నుంచి విడాకుల నోటీసులు పంపిస్తానంటూ కేఏ పాల్ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సోమవారం ఆమె ఎల్బీనగర్లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్ద కేఏ పాల్ ఫొటోను చెప్పులతో కొట్టి, దహనం చేశారు.
ఈ సందర్భంగా శంకరమ్మ మాట్లాడుతూ, తన భర్త వెంకటాచారిని కేఏ పాల్ ఇంట్లో బంధించారని, బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వెంకటాచారి వద్దనున్న రెండు సెల్ఫోన్లను పాల్ లాక్కొని, తమతో మాట్లాడకుండా చేశాడని పేర్కొన్నారు. ప్రజాశాంతి పార్టీలోకి రావాలని 15 రోజుల పాటు పాల్ తనను వేధించాడని ఆరోపించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ను వీడేది లేదని స్పష్టం చేసినట్టు చెప్పారు. తన భర్తను ప్రలోభపెట్టి ప్రజాశాంతి పార్టీలో చేర్చుకున్నారని తెలిపారు. భర్తతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, స్వార్థ రాజకీయాల కోసం తమ మధ్య చిచ్చు పెడుతున్నాడని ఆరోపించారు. కార్యక్రమంలో కాసోజు శంకరమ్మ బంధువులు సునంద, లలిత, నర్సింహాచారి, వీరాచారి, వాసుదేవాచారి, వెంకటాచారి, రఘు పాల్గొన్నారు.