సిటీబ్యూరో, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కలిగిస్తున్న వారిపై జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇందులో భాగంగానే గడిచిన మూడు రోజులుగా ఈవీడీఎం బృందాలు రాత్రి సమయాల్లో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
అనుమతి లేకుండా భవన నిర్మాణ వ్యర్థాలను తరలిస్తున్న 20 వాహనాలు సీజ్ చేయడంతో పాటు మొదటి నేరం కింద సంబంధిత యాజమానికి రూ. 25వేల జరిమానా విధించారు. అనుమతి లేకుండా భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే వాహనాలకు మొదటిసారి తప్పిదం చేస్తే రూ.25వేలు, రెండోసారి రూ.50 వేలు, మూడోసారి పట్టుబడితే రూ. లక్ష జరిమానా విధిస్తున్నట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తెలిపారు. వ్యర్థాలను వాహనాలకు అప్పగించిన ఇంటి యాజమాని, నిర్మాణ సంస్థకు రూ. 50 వేలు జరిమానా వేస్తున్నట్లు డైరెక్టర్ తెలిపారు.