ఆకట్టుకున్నవింగ్స్ ఇండియా ఎయిర్షో
భారీగా తరలివచ్చిన సందర్శకులు
చిన్నారుల కేరింతలతో కిక్కిరిసిన
బేగంపేట ఎయిర్పోర్టు ప్రాంగణం
విహంగాల వీక్షణకు నేడే చివరి రోజు
సిటీబ్యూరో, మార్చి 26 : బేగంపేట విమానాశ్రయంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఫిక్కి సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఇండియా 2022’ ఎయిర్షో ఆకట్టుకున్నది. నగర నలుమూలల నుంచి సందర్శకులు వేలాదిగా వచ్చి విహంగాలను వీక్షించారు. ఈ షో ఇంకా ఒక్కరోజే మిగిలి ఉండడంతో శనివారం విమానాశ్రయ ప్రాంగణం సందర్శకులతో కళకళలాడింది. ఎయిర్ షో సందర్శనకు వచ్చిన సీపీ సీవీ ఆనంద్కు నార్త్జోన్ డీసీపీ చందనాదీప్తి స్వాగతం పలికారు. ఆయన కాక్పిట్ సిమ్యులేటర్ ‘ఏవియానిక్స్ పార్ట్ టాస్క్ ట్రైనర్ డు-288 ఎయిర్క్రాఫ్ట్’ను ఆయన కాసేపు పరిశీలించారు.
విజ్ఞానాన్ని పంచే ప్రదర్శన
ఇది విజ్ఞానాన్ని పంచే చాలా అద్భుతమైన ప్రదర్శన. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్లు నూతన నమూనాలను ప్రదర్శనలో ఉంచారు. వివిధ రాష్ర్టాల టూరిజం, పలు రకాలు విహంగాలు, సోలార్తో ఎగిరే డ్రోన్లు, విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల ఉత్పత్తి, పలు రాష్ర్టాల విమానయాన సౌకర్యాలు, వివరాలు అనేక అంశాలు ఎంతో ఆకట్టుకున్నాయి.
– దివ్య సోని, హైదరాబాద్
ఎయిర్బస్ బాగుంది
విద్యార్థుల నుంచి మొదలుకొని అనేక సాధారణ పౌరులు కూడా వింగ్స్ ఇండియా 2022 కార్యక్రమంలో మంచి అవగాహన కలిగించే విధంగా ఏర్పాట్లు చేశారు. 19 గంటల పాటు అలసిపోకుండా ప్రయాణించేందుకు ఎయిర్బస్లో ఏర్పాట్లు ఉండడం అందరినీ ఆకట్టుకుంటున్నది. అందరూ కండ్లూ ఎయిర్ బస్ వైపే ఉన్నాయి. – మిథాలి, సందర్శకురాలు