అమీర్పేట్ : దాసారం బస్తీ నివాసితులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటునందిస్తానని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. బస్తీలో సమస్యలు తెలుసుకునేందుకు సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మిరెడ్డి, జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి ఉన్నతాధికారులతో కలిసి ఆదివారం ఉదయం బస్తీలో పర్యటించారు.
ఈ సందర్భంగా బస్తీవాసులు తమ సమస్యలను మంత్రి తలసాని దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా ఇంటింటికి నల్లా కనెక్షన్, విద్యుత్ మీటర్లు కావాలని బస్తీవాసులు చేసిన విజ్ఞప్తికి మంత్రి తలసాని వెంటనే స్పందించారు. అక్కడే ఉన్న విద్యుత్ అదికారులను ఉద్దేశిస్తూ తక్షణమే విద్యుత్ మీటర్లను మంజూరు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
ఇంటింటి నల్లా కనెక్షనక్ల అవసరమైన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని జలమండలి అధికారులను ఆదేశించారు. గార్బేజీ రిక్షాల ద్వారా ఇంటింటి చెత్తను సేకరిస్తున్న నిరుపేదలు అధికంగా ఉన్న బస్తీలో ఎటువంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా ఇక్కడి పరిసరాలతో పాటు స్థానికుల శుభ్రత అంశంపై మంత్రి స్పష్టమైన సూచనలు చేశారు.
పరిశుభ్రతను పాటిస్తూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఇక్కడి పరిసరాల్లో గుట్టలుగా పేరుకుపోయిన డెబ్రిస్, చెత్తను లక్షలాది నిధులు వెచ్చించి తరలిస్తున్నామని తెలిపారు. ఇక్కడి పరిసరాలు శుభ్రమైన తరువాత ఇక్కడే మల్టీపర్పస్ ఫంక్షన్ హాలు నిర్మించి ఇస్తానని తెలిపారు.
నామమాత్రపు ధరలకు ఫంక్షన్ హాళ్లు అందుబాటులో లేని కారణంగా పేదలు తమ ఇంటి శుభకార్యాలు చేసుకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడుతున్న విషయం తనకు తెలుసునన్నారు. నామమాత్రపు అద్దెలకు ఈ ఫంక్షన్ హాలు అందరూ వినియోగించుకునేలా ఇక్కడి పరిస్దితులు తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
టూష్యన్ల కోసం షెడ్డు నిర్మించి ఇస్తా..
ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు తమ పిల్లల కోసం సాయంత్రం సమయాల్లో ఉచిత ట్యూషన్లు నిర్వహిస్తున్నారని, వీధిదీపాల కింద కొనసాగుతున్న ఈ ట్యూషన్ల కోసం ఓ షెడ్డు నిర్మించి ఇవ్వాలంటూ బస్తీ మహిళలు మంత్రి తలసానికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు స్పందించిన మంత్రి బస్తీ పిల్లలకు సాయంత్రం సమయాల్లో పోలీసులు ట్యూషన్లు చెబుతుండడం చాలా మంచి విషయమన్నారు.
ఇక్కడ షెడ్డు ఖచ్చితంగా నిర్మించి ఇస్తానని, దీంతో పాటు ఫర్నిచర్, విద్యార్ధులకు డ్రెస్ కోడ్ ఉండేలా యూనిఫామ్లు కూడా అందేలా చూస్తానంటూ ఇచ్చిన హామీకి బస్తీ మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.