జనవరి 28: వెండితెర మీదనే కాదు క్రికెట్ గ్రౌండ్లో కూడా తమ సత్తా చాటుతున్న దక్షిణాదికి చెందిన పలువురు సినీ తారలు మొట్టమొదటిసారిగా ఆస్ట్రేలియాలో స్థానిక లీగ్ క్రికెటర్లతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ), క్రికెట్ కార్నివాల్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న ఆస్ట్రేలియాలోని జస్ట్ మెల్బోర్న్లో నిర్వహించనున్న సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ 2024, సీజన్ -1 కు సంబంధించిన కర్టన్ రైజర్ కార్యక్రమం ఆదివారం జూబ్లీహిల్స్లోని దసపల్లా హోటల్లో జరిగింది.
నిర్మాత దిల్రాజు, భారత మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, నటులు శ్రీకాంత్, తరుణ్, సుధీర్బాబు, నిఖిల్, సుశాంత్, సంగీత దర్శకుడు తమన్, నిర్వాహకులు వంశీ, సాయికృష్ణ తదితరులు టోర్నీ లోగోలను, జెర్సీలను ఆవిష్కరించారు. ఈ టోర్నీ ద్వారా వచ్చిన లాభాలను క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల చికిత్స కోసం వినియోగించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు, ఆది శ్రీనివాస్, ప్రిన్స్, ఓంకార్, డీజే సన్నీ తదితరులు పాల్గొన్నారు.