కాచిగూడ : అంబర్పేట నియోజకవర్గ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎల్లవేళల అప్రమత్తంగా ఉండాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇటీవల బర్కత్పురలో వేసిన సీసీ రోడ్డు పనులను మంగళవారం ఎమ్మెల్యే పర్యవేక్షించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న అన్ని సమస్యలను దశల వారిగా పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని ఏ డివిజన్లోనైన నీటి, డ్రైనేజీ సమస్య వచ్చిన తక్షణమే పరిష్కరించాలని జలమండలి అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
పలు డివిజన్లలో ఏండ్లనాటి తుప్పుపట్టిన డ్రైనేజి పైపులైన్ల ద్వారా కలుషిత నీళ్లు వస్తున్నాయని, త్వరలో ఆ సమస్యను పరిష్కరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంబర్పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్దిచేస్తూ, మౌళిక సదుపాయలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజల సమస్యలను అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు,స్థానికులు పాల్గొన్నారు.