శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 18 : ‘కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం శంషాబాద్ మండలంలోని రైతుల నోట్లో మట్టికొడుతారా.. ఇదేం న్యాయం.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఇక్కడి ప్రజలకు ఏమాత్రం ఉపయోగంలేని రేడియల్ రోడ్డు కోసం భూములు తీసుకోవడం ఎంతవరకు సమంజసం’ అని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ మండలం నర్కూడ గ్రామంలో రాజేంద్రనగర్ ఆర్డీవో వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న బీఆర్ఎస్ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జి కార్తిక్రెడ్డి మాట్లాడుతూ శంషాబాద్ మండల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేని రేడియల్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని భూములు దేశంలోనే ఖరీదైన భూములుగా మంచి గుర్తింపు ఉందని, అదే రంగారెడ్డి జిల్లా ప్రజల భూములు లాక్కుంటున్న ప్రభుత్వం వారికి మార్కెట్ రేట్ ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం ప్రజలకు హామీలు ఇచ్చిన పథకాలనే అమలు చేయడంలేదు. కాని ప్రజల భూములు తీసుకొని రోడ్డు వేయడానికి ఎక్కడ నిధులు ఉన్నాయో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, మాజీ జడ్పిటీసీ బుర్కుంట సతీష్, నర్కూడ సర్పంచ్ శేఖర్యాదవ్, ఉప సర్పంచ్ మహేశ్ ముదిరాజ్,తహసీల్దార్ రవీందర్దత్ తదితరులు పాల్గొన్నారు.