DSP Ranganaik | తుర్కయంజాల్, ఏప్రిల్ 15: మెదక్ ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోకుండా విడాకులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం తుర్కయంజాల్ సాయి పంచవటి హోమ్స్ కాలనీలోని ఏఆర్ డీఎస్పీ రంగనాయక్ ఇంటి ముందు ఆయన భార్య జ్యోతి ఆందోళన చేపట్టారు. మెదక్ ఏఆర్ డీఎస్పీ తుర్కయంజాల్ సాయి పంచవటి హోమ్స్లోని తన సొంత ఇంటిలో కొద్ది సంవత్సరాలుగా ఉంటున్నారు. రంగనాయక్ దంపతుల మధ్య విభేదాలు రావడంతో ఆయన భార్య జ్యోతి గతేడాది నవంబర్లో మిర్యాలగూడ సమీపంలోని తన తల్లి ఇంటికి వెళ్లింది.
ఈ క్రమంలో నల్గొండ మహిళా పోలీస్స్టేషన్లో రంగనాయక్పై ఫిర్యాదు చేశారు. కాగా, సోమవారం జ్యోతి తన కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయక్ ఉంటున్న ఇంటికి వచ్చారు. వీరి రాకను గమనించి..ఇంటిపైకి రాకుండా మెట్ల వద్ద ఉన్న గేటుకు తాళం వేశారు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయక్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. 100 నంబర్కు డయల్ చేయడంతో ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారి ప్రమేయంతో రంగనాయక్ ఇంటి గేటు తాళాన్ని తీసి భార్యను ఇంటిలోకి రానిచ్చారు.