బంజారాహిల్స్, ఆగస్టు 11: చట్టబద్ధంగా తనకు విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తిని పెండ్లి చేసుకున్న భార్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భర్త బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని ఫస్ట్ లాన్సర్లో నివాసముంటున్న మహ్మద్ సుల్తాన్కు 2013లో ఓ మహిళతో పెద్దల సమక్షంలో వివాహమైంది. కొన్నేళ్లపాటు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉన్నారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో చాలాకాలంగా ఆ మహిళ పుట్టింటిలోనే ఉంటున్నది. కాగా, ఆమెకు ఆ తర్వాత మహ్మద్ ముబీనుద్దీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్తకు చట్టపరంగా విడాకులు ఇవ్వకుండానే నాలుగేండ్ల కిందటే ఆమె ముబీనుద్దీన్ను పెండ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సుల్తాన్ ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులను నిలదీస్తూ వచ్చాడు. విడాకులు ఇవ్వకుండానే మరో వ్యక్తిని పెండ్లి చేసుకోవడమే కాకుండా తనపై గృహహింస కేసులు పెట్టారని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, సదరు మహిళా సోదరులు తనపై పలుమార్లు దాడి చేశారని పేర్కొంటూ బాధితుడు సుల్తాన్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.