బంజారాహిల్స్,ఆగస్టు 11: మానసిక సమస్యతో జ్ఞాపకశక్తి కోల్పోయిన తన భర్త రూ.2కోట్ల విలువజేసే ఇంటిని వేరొకరి పేరిట రిజిస్ట్రేషన్ చేశారంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఎస్బీహెచ్ కాలనీకి చెందిన వెంకట రాంప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేశాడు. అతడికి భార్య వాసవితో పాటు కుమార్తె (15) ఉన్నారు. ఐదేండ్ల కిందట తీవ్రమైన తలనొప్పి రావడంతో నిమ్స్ ఆస్పత్రిలో చేరిన రాంప్రసాద్కు సర్జరీ చేశారు. సర్జరీ తర్వాత ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయాడు. ఉద్యోగం కూడా పోయింది.
మతిస్థిమితం కోల్పోయిన అతడు 2017లో ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయాడు. భార్య వాసవి ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. కొన్నాళ్ల తర్వాత అతడి ఆచూకీని గుర్తించి వాసవికి అప్పగించారు. అప్పటి నుంచి భార్యతో పాటే ఉంటున్నాడు. ఇదిలా ఉండగా.. మదీనాగూడలో రాంప్రసాద్కు రూ.2 కోట్ల విలువైన ఇల్లు ఉంది. ఆ ఇల్లు ప్రస్తుతం కె.పద్మ పేరుతో 2017లో రిజిస్టర్ అయినట్లు వాసవి గుర్తించింది. మతిస్థిమితం సరిగా లేని తన భర్త చేత గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిని రిజిస్టర్ చేయించుకున్నారని పేర్కొంటూ..వాసవి ఇటీవల కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు భర్తతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.