హైదరాబాద్ : ఫిజియోథెరపీ అనగానే ఏవో రకరకాల వ్యాయామాలు చేయిస్తారని, ఒకే లాంటివి పదే పదే చేయాల్సి ఉంటుందని అనుకుంటారు. దీర్ఘకాల చికిత్సలు అవసరమై, కొంత వైకల్యం ఉన్నవారిలో డిప్రెషన్ బాగా పెరిగిపోతుంది. దీన్ని అధిగమించి, అలాంటివారినీ సామాజిక జీవనంలోకి తీసుకొచ్చేందుకు ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ సంస్థ తమ గచ్చిబౌలి కేంద్రంలో ‘వీల్చైర్ సల్సా’ అనే ఓ విప్లవాత్మక కార్యక్రమం చేపట్టింది. తమ జీవితాల్లో ఫిజియోథెరపీ తీసుకురాగల సానుకూల మార్పులను ఆహ్వానించేలా.. బాధితులతో డాన్సులను ఆస్వాదింపజేసి, వారిలో ఉన్న అన్ని రకాల సామర్థ్యాలను వెలికితీసేందుకు ఈ అసాధారణ కార్యక్రమం నిర్వహించింది. ఫిజియోథెరపీతో పాటు నృత్యాన్ని కూడా కలగలిపి ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా ఉచ్ఛ్వాస్ ట్రాన్సిషనల్ కేర్ డైరెక్టర్, న్యూరో రీహాబిలిటేషన్లో ప్రముఖుడు అయిన డాక్టర్ విజయ్ బత్తిన మాట్లాడుతూ, ‘‘ఈ కార్యక్రమంలో పేషెంట్లు సాధారణంగా వేసుకునే లేత నీలిరంగు, ఇతర దుస్తులు కాకుండా తమకిష్టమైన రంగురంగుల దుస్తులు వేసుకుని, ఈ కార్యక్రమం ద్వారా తమలో ఉన్న టాలెంటును బయటపెట్టారు. ముందుగా మంచి సంగీతం వినిపించి, వారిలో స్ఫూర్తిని నింపారు. బ్రెయిన్ స్ట్రోక్, హెడ్ ఇంజ్యురీ, స్పైనల్ కార్డ్ ఇంజ్యురీ అయ్యి, వాటి నుంచి కోలుకుంటున్న పది మందితో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా వాళ్లంతా 45 నిమిషాల పాటు మూడు కార్యక్రమాలు చేశారు. వాటిలో వీల్చైర్ సల్సా డాన్స్, చిన్న చిన్న గేమ్స్ ఆడటం, పాటలు పాడటం లాంటివి ఉన్నాయి. ఇవన్నీ చక్రాలకుర్చీలో కూర్చునే చేశారు. సాధారణంగా ఫిజియోథెరపీ అనగానే ఒకే రకం వ్యాయామాలు పదే పదే చేయిస్తామనుకుంటారు. వాళ్లు ఒక గదిలో కూర్చుని ఇలా థెరపీ చేస్తే అంత మంచి ఫలితాలు రావన్నది శాస్త్రీయంగా రుజువైంది. దానివల్ల వాళ్లు నలుగురితో కలవలేరు, పండుగల్లో పాల్గొనలేరు. దానికితోడు వైకల్యంతో ఉన్నవారు బాగా డిప్రెషన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఈ మూసధోరణిని అధిగమించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం”అని తెలిపారు.