అంబర్పేట, సెప్టెంబర్ 26 : బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ముస్లింలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం అంబర్పేటలో ముస్లిం శ్మశానవాటికకు ప్రభుత్వం ద్వారా కేటాయించిన మూడెకరాల స్థలంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎంఐఎం ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బేగ్, రియాజు హాసన్ ఇఫాండి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్రెడ్డిలతో కలిసి మంత్రి మహమూద్ అలీ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ఎన్నికల సమయంలో ముస్లింల స్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని మంత్రి కేటీఆర్తో పాటు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హామీ ఇచ్చారని, హామీ మేరకు మూడు ఎకరాల స్థలాన్ని ముస్లిం గ్రేవ్ యార్డుకు కేటాయించారన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమవేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా మైనార్టీ పిల్లల కోసం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూళ్లలో 40వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. షాదీముబాకర్, ఇమామ్లకు గౌరవ వేతనం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. యాభై ఏళ్లలో మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవే ఇవ్వలేదని, సీఎం కేసీఆర్ ముస్లింలను గుర్తించి డిప్యూటీ సీఎంతో పాటు హోంశాఖను అప్పగించారని, ఇది ముస్లింలకు దక్కిన గౌరవమన్నారు.
వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కాలేరు వెంకటేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోలింగ్కు చాలా మంది బయటకు రావడం లేదని, ఈసారి 90 శాతం పోలింగ్ జరిగేలా ముస్లిం పెద్దలు, యువకులు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్రెడ్డి, బి.పద్మవెంకటరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు, ఎంఐఎం నాయకులు, ముస్లిం మత పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.