బంజారాహిల్స్, ఫిబ్రవరి 10: వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎనిమిదేళ్లు గడిచినా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, బీజేపీ తీరుకు నిరసనగా ఫిబ్రవరి 13న హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి దిగ్బంధం చేయనున్నామని ఎంఎస్పీ జిల్లా కో ఇన్చార్జి నర్సింగరావు మాదిగ అన్నారు. శుక్రవారం ఫిలింనగర్లోని మహనీయుల చౌరస్తాలో ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాదిగ మాట్లాడుతూ.. 2014నుంచి ఎస్సీ వర్గీకరణ అంశాన్ని నిర్లక్ష్యం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో మాదిగలు తమ సత్తా చూపిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు బొప్పారపు వేణు మాదిగ, ఎంఎస్పీ నాయకులు కండె రామ్కుమార్, శివకుమార్, కుమార్ మాదిగ, చాగంటి వెంకన్న, పద్మారావు, దిలీప్, సదానందం తదితరులు పాల్గొన్నారు.