సికింద్రాబాద్, ఏప్రిల్ 4: సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంపై గులాబీ జెండా ఎగురవేస్తామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా అడ్డగుట్ట, సీతాఫల్మండి, తార్నాక, మెట్టుగూడ, బౌద్ధనగర్ తదితర డివిజన్లకు చెందిన సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో సీతాఫల్మండి డివిజన్ టీఆర్టీ క్వార్టర్స్ సమీపంలో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ…
‘సికింద్రాబాద్లో 50 ఏండ్లలో జరుగని అభివృద్ధిని….కేవలం పదేండ్లలోనే చేసి చూపించాం. నియోజకవర్గ ప్రజలకు అన్ని వేళ్లలో అందుబాటులో ఉన్నాం. వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాం’ అని అన్నారు. ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేసి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు హేమ , ప్రసన్న లక్ష్మి , శైలజ , యువజన విభాగం నాయకులు రామేశ్వర్ గౌడ్ , కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.