సిటీబ్యూరో, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ ) : పార్కు, విద్యా సంస్థల స్థాపనకే రాజరాజేశ్వరి కాలనీలోని ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉపయోగిస్తామని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) కమిషనర్ జి.సృజన తెలిపారు. కొండాపూర్లోని రాజరాజేశ్వరి కాలనీలో విద్యా సంస్థలు, పార్కు అభివృద్ధికి కేటాయించిన ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సీఎంసీ కమిషనర్ సృజన, విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, హైడ్రా కమిషనర్ రంగనాథ్లు ఆదివారం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
కాలనీ ఆమోదిత లే అవుట్ ప్రకారం ఐదు ఎకరాలు విద్యా సంస్థల స్థాపనకు, ఎకరం పార్కు అభివృద్ధికి కేటాయించినట్లు అధికారులు తెలిపారు. స్థలాన్ని లే అవుట్, రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి పరిశీలించగా, విద్యా, పార్కు అవసరాలకు కేటాయించిన భూమిలో కొంతభాగం ఆక్రమణకు గురైనట్లు కమిషనర్లు గుర్తించారు. లే అవుట్ ప్రకారం భూమిని సృష్టంగా డీ మార్కేషన్ చేసిన అధికారులు సంబంధిత శాఖల ద్వారా ఫెన్సింగ్ పనులు చేపట్టారు. తద్వారా భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఐదు ఎకరాల స్థలంలో విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎంసీ సృజన విద్యాశాఖ కమిషనర్ను ఆదేశించారు. ఎకరం స్థలంలో పార్కు అభివృద్ధి చేస్తామని కమిషనర్ సృజన తెలిపారు.
పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఆనంతరం సమీపంలోని మార్కెట్ ప్రాంతాలను సీఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి వ్యాపారి తన దుకాణం వద్ద తప్పనిసరిగా డస్ట్బిన్ ఏర్పాటు చేసుకోవాలని, రోడ్లపై చెత్త వేయరాదని సూచించారు. సేకరణ సమయంలో చెత్త వాహనాల్లో వ్యర్థాలను వేయాలని చెప్పారు. పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రత నిబంధనలు కచ్చితంగా పాటించాలని, రోడ్లపై చెత్త పేరుకుపోకుండా నిరంతర పర్యవేక్షించాలని సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు.