బండ్లగూడ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని పల్లెలన్నీ పట్టణాలుగా ప్రగతి పథంలో నడుస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పేర్కొన్నారు. గండీపేట మండల పరిధిలోని బండ్లగూడలో దాదాపు ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన పలు అభివృద్ది పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు గాను అనేక సంక్షేమ పథకాలను చేపడుతున్నారని వివరించారు. పల్లెలలో ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు పాటు పడుతున్నట్లు తెలిపారు.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కొనసాగుతోందన్నారు. శివారు గ్రామాలకు మంచినీటి సరఫరాతో పాటు నూతనంగా ఏర్పడుతున్న కాలనీలలో రోడ్లు, ఇతర అభివృద్ది పనులను చేపడుతున్నామన్నారు.
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీలు, గ్రామాలలో మరో ఏడాదిలో అన్ని అభివృద్ధి పనులను చేపడతానని హామీఇచ్చారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ది పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
మిగిలిన పనులన్నింటిని ఏడాది లోపు పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశిస్తున్నామన్నారు. కేంద్రీయ విహార్ వద్ద డ్రైన్వాటర్ పనులను ఆయన మేయర్ మహేందర్ గౌడ్, డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం 18వ వార్డులోని హిల్ టౌన్ పార్క్, ప్రశాంత్ నగర్, పీరం చెరువులో స్టామ్ వాటర్ డ్రైన్, సీసీ రోడ్డు పనులకు ఆయన శంఖుస్థాపన చేశారు.
కార్పొరేషన్ కమిషనర్ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు సాగర్ గౌడ్, శ్రీలత సురేష్ గౌడ్, పద్మావతి పాపయ్య యాదవ్, అనిత వెంకటేష్, లత ప్రేమ్ గౌడ్, బీజేఎంసీ టీఆర్ఎస్ అద్యక్షుడు సురేష్ గౌడ్, నాయకులు సుమన్ గౌడ్, గోపాల్, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.