సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రశాంత వాతావరణంలో ఇన్స్డెంట్ ఫ్రీగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి ఓటు వేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు. గురువారం జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 9వ తేదీ నుంచి వాహనాల తనిఖీ చేపట్టామని, 2.5 లక్షల వాహనాలను తనిఖీ చేసినట్టు తెలిపారు. ప్రతి రోజు నంబర్ ప్లేట్, డాక్యుమెంట్లు సరిగ్గా లేని 25 వాహనాల వరకు సీజ్ చేశామన్నారు. దీంతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి రూ. 63 కోట్ల విలువైన నగదు, మద్యం సీజ్ చేశామన్నారు. 2400 నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేసినట్టు తెలిపారు. నగరంలో ఉన్న 1600 మంది రౌడీషీటర్లను ప్రతిరోజు స్థానిక పోలీసులు తనిఖీ చేస్తున్నారని, ఎవరైనా అందుబాటులో లేకుంటే టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని వెంబడిస్తున్నారని వివరించారు.
లైసెన్స్, వాహనాల డాక్యుమెంట్లు , హెల్మెట్ లేకుండా బయటకు వెళ్లొద్దని, తనిఖీల్లో పట్టుబడ్డ వాహనాలను సీజ్ చేసి ఎన్నికల తరువాత తిరిగి ఇస్తామన్నారు. ప్రతి రోజు 31 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, పది రోజుల్లో 7000 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు. నగరంలో ఉన్న 1700 పోలింగ్ కేంద్రాలలో.. 666 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద సీఏపీఎఫ్ ఫోర్స్ ఉంటుందన్నారు. నగరంలో ఉన్న ఏడు జోన్లకు 40 కంపెనీల సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ బందోబస్తులో పాల్గొంటున్నట్టు తెలిపారు.
ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరు కూడా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాద్దని సీపీ సూచించారు. మీ కోసం మేమున్నాం.. ఏదైనా జరిగితే వెంటనే డయల్ 100కు కాల్ చేయాలన్నారు. స్థానిక పోలీసులకు, ఎన్నికల అధికారులకు కూడా సమాచారమివ్వాలన్నారు. వెంటనే చర్యలు తీసుకుంటారని సీపీ సూచించారు. ఎవరినైనా బెదిరించినా, బెదిరించే ప్రయత్నం చేసినా పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తారన్నారు. చిన్న ఘటన జరిగినా ప్రజలు భయపడే అవకాశం ఉంటుందని, ఫ్రీ ఫెయిర్ ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. చిన్న ఘటన జరిగినా ప్రజలు భయపడి ఓటింగ్కు దూరంగా ఉండే అవకాశం ఉందన్నారు. ఎవరు కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు. ఎవరైనా గొడవలు చేయలని ప్రయత్నిస్తే వెంటనే అరెస్ట్ చేసి, ఎన్నికల తరువాత విడిచిపెడుతామన్నారు. ఎన్నికలు ఒక పండుగలా జరుపుకోవాలని, వ్యక్తిగత విద్వేషాలకు పోవద్దని సూచించారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా బయటకు వచ్చి ఓటెయ్యాలని, జిల్లాలో 80 శాతం వరకు పోలింగ్ జరుగుతుందని, అదే హైదరాబాద్లో 40 నుంచి 50 శాతం మాత్రమే ఉంటుందని, ఈ సారి అందరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ శాతాన్ని భారీగా పెంచాలని కోరారు.