హైదరాబాద్ : ప్రైవేట్ దేవాలయాలకు కూడా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం రాంగోపాల్ పేట మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి నివాసంలో నిర్వహించిన బోనం సమర్పణ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బోనాలను ఘనంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాల ఉత్సవాల విశిష్టత మరింత పెరిగిందన్నారు. ఆషాఢ బోనాల ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని తెలిపారు.
ఈ నెల 17 న జరగనున్న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర, 24 న జరిగే హైదరాబాద్ బోనాలకు సందర్భంగా వచ్చే లక్షలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో అంబారీ ఊరేగింపు ఖర్చును ఆయా దేవాలయాలు భరించేవని, ఇప్పుడు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
అంతేకాకుండా ప్రధాన దేవాలయాలకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను కూడా సమర్పిస్తున్నామని వివరించారు. కళాకారులచే పలు దేవాలయాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు 3500 కు పైగా ప్రభుత్వ, ప్రయివేట్ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. బోనాల సందర్భంగా 100 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచన అన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.