తెలంగాణ నలుమూలలా నయాగారాలు
ప్రకృతి రమణీయతను పంచే అద్భుత జలపాతాలు
యాత్రికుల హృదయాలను తాకుతున్న జలధారలు
సిటీబ్యూరో, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు పరవశించి పోయే రమణీయతను పంచే జలధారలు నగరానికి నలువైపులా ఉన్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం చారిత్రక నేపథ్యంతో పాటు తెలంగాణ నలుమూలల నయాగారా జలపాతాన్ని మించిన వాటర్ ఫాల్స్ను ప్రభుత్వం గుర్తించి వెలుగులోకి తీసుకొచ్చింది. వారాంతాలు, సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతి ఒడిలో గడిపేందుకు రాష్ట్రంలోని జలపాతాలను తెలంగాణ పర్యాటక శాఖ గుర్తించింది. జలపాతల సందర్శనకు వెళ్లే పర్యాటకుల కోసం ప్రత్యేక ప్యాకేజీలను కూడా పర్యాటకశాఖ ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ నుంచి అయినా, సొంత వాహనాల్లో అయినా విహారయాత్రలకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తగా ఉండాలి. సెల్ఫీ మోజులోనో, లేక ఇతర ప్రయత్నాల్లో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా విహార యాత్ర విషాదంగా ముగిసే అవకాశాలు లేకపోలేదు. అందుకే జాగ్రత్తగా వెళ్లి జాలువారుతున్న జలపాతాల జలసవ్వడులు చూసొద్దాం. వాటి అనుభూతిని తనివితీరా ఆస్వాదిద్దాం.
హైదరాబాద్ నుంచి 270 కిలోమీటర్లు
దట్టమైన అడవుల్లో సహ్యాద్రి పర్వత శ్రేణిలో గోదావరి నదికి ఉపనది అయిన కడెం నదిపై కుంటాల జలపాతం ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వాటర్ఫాల్స్ తెలంగాణలోనే అత్యంత ఎత్తైన వాటర్ఫాల్గా గుర్తించారు. ఈ ప్రాంతంలోకి ప్రవేశించిన తర్వాత, జలపాతం వద్దనున్న 408 మెట్లశ్రేణికి చేరుకోవాలంటే అర కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది. 200 అడుగుల ఎత్తు నుంచి రాళ్ల సొరికల గుండా ప్రవహిస్తూ, అనేక పాయలుగా విడిపోయి పై నుంచి కిందికి నిటారుగా దూకుతుంది. అందువల్ల వాటర్లోకి దిగితే ప్రమాదకరం.
హైదరాబాద్ నుంచి 185 కిలోమీటర్లు
పేరుకు తగ్గట్టే మల్లెపూల కంటే తెల్లనైన జలపాతంలా జలజలా జాలువారుతుంది. ఇది మహబూబ్నగర్ జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో విస్తరించి ఉన్న దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో కనిపించే ఒక సుందర జలపాతం. శ్రీశైలం వెళ్లే జాతీయ రహదారిలో వచ్చే అమ్రాబాద్ మండలంలోని వట్వర్లపల్లి నుంచి 9 కిలోమీటర్లు అడవి మార్గంలో ప్రయాణిస్తే మల్లెలతీర్థం చేరుకోవచ్చు. ఈ నీటిలోకి చేరాలంటే సుమారు 250 మెట్లుదిగి వెళ్లాలి.
హైదరాబాద్ నుంచి 252 కిలోమీటర్లు
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో ఉంది. కొత్తగా ఏర్పడిన లింగాపూర్ మండలంలోని పిట్టగూడ నుంచి 3 కిలోమీటర్లు కాలినడకన వెళితే.. మిట్ట జలపాతానికి చేరుకుంటాం. అక్కడి దట్టమైన హరిత అందాల నడుమ ఒకదానికి పకనే ఒకటి 7 జలపాతాలు దర్శనమిస్తాయి. వీటితే సప్తగుండాలు లేదా
సప్త జలపాతాలు అని పిలుస్తారు.
హైదరాబాద్ నుంచి 163 కిలోమీటర్లు
ఎత్తిపోతల జలపాతం నాగార్జునసాగర్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. 22 మీటర్ల ఎత్తునుంచి జలజలా దూకి కృష్ణానదిలో కలుస్తుంది. ఇందులో మూడు ప్రవాహాలు (నక్కవాగు, తుమ్మలవాగు, చంద్రవంక వాగు) కలిసి సహజసిద్ధమైన అందాలు కండ్లకు కడుతాయి. జలపాతం దిగువన మొసళ్ల పెంపక కేంద్రం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
హైదరాబాద్ నుంచి 277 కిలోమీటర్లు
ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత గ్రామంలో దట్టమైన అడవుల మధ్యఈ జలపాతం ఉన్నది. వాజేడుకు 5 కిలోమీటర్ల దూరాన ఉంది. చత్తీస్గఢ్ సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జూలై నుంచి నవంబర్ వరకు భారీ జలధారలతో దూకుడు కనిపిస్తుంది. దీనికి మరోపేరు చీకులపల్లి జలపాతం. 30 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకి పెద్ద జలాశయంగా ఏర్పడుతుంది.