మల్కాజిగిరి, జనవరి 18: కరోనా వైరస్ విజృంభిస్తున్నది. పది రోజుల్లో 5,024మందికి కరోనా పరీక్షలు చేయగా.. అందులో 820 మందికి కరోనా పాజిటీవ్గా వచ్చింది. దీంతో అప్రమత్తమైన వైద్య, ఆరోగ్య శాఖతోపాటు మున్సిపల్ సర్కిల్ సిబ్బంది, ఎంటమాలజి సిబ్బంది వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఓమిక్రాన్ కేసులు నమోదు కాలేదు. కాలనీల్లో కరోనా వైరస్ నివారణ కోసం ఇంటింటికీ రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. అరవై సంవత్సరాలు నిండి ఇప్పటికే రెండు డోసులు తీసుకుని తొమ్మిది నెలలు దాటిన వారికి ప్రస్తుతం బూస్టర్ డోస్ను 84,305 మందికి ఇస్తున్నారు. మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో 15 నుంచి 18 సంవత్సరాలలోపు దాదాపు 30వేల మంది విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేస్తున్నారు. ఫ్రంట్లైన్ వారియర్స్ పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని 312 కాలనీల్లోని 1,03,198 ఇండ్లలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి, అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. సర్కిల్ పరిధిలో మల్కాజిగిరి, మౌలాలి, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతంనగర్, వినాయక్నగర్, నేరేడ్మెట్ డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్కు ఒక ఏఈని నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఇంటింటికీ సర్వే నిర్వహించి మొదటి డోస్ టీకా వేసి పేర్లను నమోదు చేస్తున్నారు. వారి సెల్ఫోన్కు మెసేజ్ వచ్చే మాదిరిగా చర్యలు తీసుకుంటున్నారు. అప్పటికే మొదటి డోస్ తీసుకుంటే కాలపరిమితిని బట్టి రెండో డోసును ఇస్తున్నారు. ఇంట్లో ఉన్న అర్హులైన వారందరూ కరోనా టీకా తీసుకుంటే వారి ఇంటికి స్టిక్కర్లు అంటించనున్నారు. మల్కాజిగిరి ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం పరిధిలో ఇప్పటికే మొదటి డోసు 80 శాతం, రెండో డోసు దాదాపు 70 శాతం మంది తీసుకున్నట్లు అంచనాలు వేస్తున్నారు.
అర్హులైన వారి పేర్లు నమోదు..
మల్కాజిగిరి సర్కిల్ పరిధిలోని 312 కాలనీలలో ఉన్న 1,03,198 ఇండ్లలోని 15 సంవత్సరాలకు పైనఉన్న వారి వివరాలు సేకరించారు. నేరేడ్మెట్ డివిజన్లో 117 కాలనీల్లో 29,028 ఇండ్లు, వినాయక్నగర్లో 34 కాలనీల్లో 18,677 ఇండ్లు, మౌలాలిలో 54కాలనీల్లో 14,894 ఇండ్లు, ఈస్ట్ ఆనంద్బాగ్లో 41 కాలనీల్లో 14,168ఇండ్లు, మల్కాజిగిరిలో 35కాలనీల్లో 12,053 ఇండ్లు, గౌతంనగర్లో 31కాలనీల్లో 14,378 ఇడ్లులో పది రోజుల పాటు ఇంటింటికీ సర్వేచేసి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. 74 మంది అధికారులతో పాటు విద్యాశాఖ, మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
కరోనా వైరస్ను అరికట్టడానికి చర్యలు
కరోనా వైరస్ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ఆరోగ్య శాఖతో పాటు మున్సిపల్ సర్కిల్ అధికారులు ఇంటింటికీ సర్వే నిర్వహించారు. అర్హులైన వారందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశాం. 60 ఏండ్లు నిండిన 84,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ ఇస్తున్నాం. 15 నుంచి 18 నిండిన దాదాపు 30వేల మందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నాము.