Corona | సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): సాధారణ జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సీజనలే కదా.. అని నిర్లక్ష్యం చేయవద్దంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో సాధారణంగానే వైరల్ ఫీవర్స్, ఫ్లూ వంటి వ్యాధులు వస్తుంటాయి. కాని, మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి లక్షణాలు కనిపించినా సకాలంలో వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోయినా..! అనుమానిత లక్షణాలు కనిపించినా..! వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న జేఎన్.1 వేరియంట్పై పూర్తి స్థాయి సమాచారం లేదని, ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జేఎన్.1 లక్షణాలు సీజనల్ వ్యాధుల లక్షణాల్లా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
వేగంగా వ్యాప్తిచెందే స్వభావం ఉండటం వల్లే..
2020, 2021లో వచ్చిన వేరియంట్లతో పోల్చితే ఆ తరువాత వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాపించే స్వభావం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం మరోసారి అలజడి సృష్టిస్తున్న జేఎన్.1.. ఒమిక్రాన్కు ఉపవేరియంటే కావడం వల్ల ఈ వేరియంట్ సహజంగానే వేగంగా వ్యాపించే స్వభావం ఉంటుందని వైద్యులె చెబుతున్నారు. అంతేకాకుండా.. జేఎన్.1 లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలను పోలి ఉండటం వల్లే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కరోనా, సీజనల్ను వెనువెంటనే గుర్తించడంలో కొంత అయోమయం ఏర్పడే అవకాశం ఉంది. అయినప్పటికీ గత కరోనా కాలంలో పనిచేసిన అనుభవం, పరీక్షల ద్వారా వైద్యులు వీటిని గుర్తించగలుగుతారని నిపుణులు చెబుతున్నారు.
నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తలు తీసుకుంటే మంచిది
ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే సాధారణ లక్షణాలే అని, సీజనలే కదా.. అని నిర్లక్ష్యం చేయవద్దు. సాధారణ జలుబు, జ్వరమైనా సకాలంలో చికిత్స తీసుకుంటేనే తగ్గుతుంది. లేకుంటే కొన్నిసార్లు సమస్య తీవ్రంగా మారే అవకాశాలుంటాయి. ప్రస్తుతం మరోసారి కరోనా ఉనికి కనిపిస్తున్నందున ఎలాంటి లక్షణాలున్నా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం, అవసరమైతే వైద్య పరీక్షలు చేయించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం. అదే సమయంలో జేఎన్.1 వేరియంట్ విషయంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ వైరస్కు సంబంధించి ఆందోళనకర పరస్థితులు లేవు. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళా రాష్ర్టాల్లో కేసులు నమోదవుతున్న దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు పాటించడం మంచిది.
– డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ నిపుణులు, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన