మారేడ్పల్లి, మార్చి 1: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల షెడ్యుల్ విడుదల కావడంతో ఓటర్ నమోదు కార్యాక్రమంలో బిజిబిజీగా మారారు ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు. వార్డుల వారీగా బస్తీ, కాలనీల్లో తమకు తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల ఓట్లు ఓటరు లిస్టులో ఉన్నాయా లేవా అని తెలుసుకుంటూ.. ఓటు లేని వారి వివరాలను నమోదు చేస్తున్నారు. దీంతో బస్తీ, కాలనీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తుంది. బోర్డు ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థులు ప్రత్యేకంగా తమ కాలనీ, బస్తీలో ఉన్న ఓటర్ల నమోదు పై ప్రత్యేక దృష్టిని సారించారు. ముఖ్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులతో పాటు స్వతంత్ర నాయకులు కూడా తమ ఓటు బ్యాంకు ఉండేలా ఓటరు నమోదుకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అపార్టుమెంట్లు, కాలనీల్లో ఓటర్ల వివరాలను తెలుసుకుంటూ.. ఓటరు నమోదు దరఖాస్తు ఫారాలను అందజేస్తున్నారు.
నేటి నుంచి ప్రారంభం
నేటి నుంచి 4వ తేదీ వరకు ఓటరు నమోదు, పేర్లు, చిరునామా మార్పులు, చేర్పుల దరఖాస్తుల స్వీకరణ, 23న ఓటర్ల తుది జాబితా విడుదల కానన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా బోర్డు కార్యాలయంలో అధికారికంగావార్డుల వారీగా ఉన్న ఓట రు జాబితాను ఆశవాహులు, పలు పార్టీల నాయకులు బోర్డు కార్యాలయం నుంచి తీసుకెళ్తున్నారు. ఓటరు లిస్టు లో ఎవరి ఓట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి తదితర వివరాలను నాయకులు ఆరా తీస్తున్నారు. వార్డుల వారీ గా ఓటర్ల సంఖ్య ఇలా ఉన్నాయి. 1వ వార్డు 20,826 , 2వ వార్డు 7,872 ,3వ వార్డు 15,92 2, 4వ వార్డు 13,956, 5వ వార్డు 22,919, 6వ వార్డు 21,844,7వ వార్డు 12,461, 8వ వార్డు 16,922 మంది ఓటర్లు ఉన్నారు. బోర్డు కార్యాలయంలో 8 వార్డులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నామని,ఉదయం 10నుం చి సాయం త్రం 5 గంటల వరకు ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందనిఎన్నికల ఇన్చార్జి అప్జల్ తెలిపారు.