సిటీబ్యూరో, అక్టోబర్ 1: (నమస్తే తెలంగాణ): హైరిస్క్ రోగులతోపాటు హైరిస్క్ పరిధిలోని వలసదారులు, సంచారజాతులు, ట్రక్కర్స్, డ్రగ్స్ వినియోగదారులతోపాటు ఆరు కేటగిరీలకు చెందిన వారికి ప్రభుత్వం ఊరట కల్పించింది. వీరికి హెపటైలిస్-బి, హెపటైటిస్-సి పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కలిగిన వారికి సాధారణంగా హెపటైటిస్-బి లేదా హెపటైటిస్-సి వచ్చే అవకాశాలు ఎక్కువ.
ప్రధానంగా హెచ్ఐవీ బాధితుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఈ వ్యాధులు సోకే అవకాశాలు అధికం. వీరితోపాటు తలసీమియా వ్యాధిగ్రస్తులు కూడా తరచూ రక్తమార్పిడి చేయించుకుంటుండడం వల్ల వీరిలో కూడా ఈ వ్యాధులు వచ్చే అవకాశముంటుంది. సెక్సువల్ ఎఫైర్స్ అధికంగా కలిగి ఉండే అవకాశాలున్న మైగ్రేట్స్, డ్రగ్స్ వినియోగదారులు, ట్రక్కర్స్కు సైతం హెపటైటిస్-బి, సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. వీరందరినీ హెపటైటిస్-బి, సిల నుంచి రక్షించడమే కాకుండా వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం, వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి మెరుగైన చికిత్స అందించే ఉద్దేశంతో ప్రభుత్వం హెపటైటిస్-బి, హెపటైటిస్-సి పరీక్షల నిర్వహణకు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15 జిల్లాల్లో 70వేల మంది హైరిస్క్ రోగులు, హైరిస్క్ కేటగిరి వారిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. మొదట హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఈ పరీక్షలను ప్రారంభించారు. ఈ మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 40వేల మందికి హెపటైటిస్-బి, సి పరీక్షలను నిర్వహించనున్నారు. గత నెల ప్రారంభమైన ప్రత్యేక శిబిరాల్లో ఇప్పటివరకు 16వేల మందికి పరీక్షలు పూర్తి చేశారు.
హెపటైటిస్-బి, హెపటైటిస్-సి పరీక్షలకు ప్రైవేటు కేంద్రాల్లో రూ.7000 వరకు ఖర్చవుతుంది. ఇంతటి ఖరీదైన పరీక్షలను ప్రస్తుతం హైదరాబాద్ జిల్లా పరిధిలో ప్రారంభించారు. నివేదికలో పాజిటివ్ వచ్చిన వారికి నిమ్స్ ప్రభుత్వ దవాఖానలో రూ.12కోట్లతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ల్యాబ్లో వైరల్లోడ్ పరీక్షలు నిర్వహిస్తారు.
హెపటైటిస్-బి, హెపటైటిస్-సి వ్యాధులకు సంబంధించిన చికిత్స లక్షల్లో ఉంటుంది. ఇంతటి ఖరీదైన వైద్యాన్ని ఉస్మానియా దవాఖాన గ్యాస్ట్రో విభాగంలో ఉచితంగా అందిస్తున్నట్లు విభాగాధిపతి డాక్టర్ బి.రమేష్ తెలిపారు. ముఖ్యంగా హైరిస్క్ కేటగిరికి చెందిన వారిలో హెపటైటిస్-బి లేదా హెపటైటిస్-సి నిర్ధారణ జరిగితే వారి కోసం ఉస్మానియాలో ప్రత్యేకంగా మోడ్రన్ ట్రీట్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రోగులకు ఇక్కడ మెరుగైన, క్లిష్టమైన చికిత్సలు నిర్వహిస్తుండడం విశేషం.
ప్రజల ఆరోగ్య సంరక్షణే ప్రధాన లక్ష్యం. హైరిస్క్ కేటగిరి వారికి హెపటైటిస్-బి, సి పరీక్షలతోపాటు సీబీపీ, ఎల్ఎఫ్టీ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన వారికి వైరల్ లోడ్ నిర్ధారణ కోసం నిమ్స్లో ఉచితంగానే వైరల్లోడ్ పరీక్షలు చేస్తున్నారు. అనంతరం ఉస్మానియా మోడ్రన్ ట్రీట్మెంట్ సెంటర్లో బాధితులకు ప్రత్యేక చికిత్స అందిస్తాం. – డాక్టర్ వెంకటి, హైదరాబాద్ డీఎంహెచ్వో