హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య శనివారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే హైదరాబాద్ అమీర్పేట్లోని రోశయ్య నివాసానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ వెళ్లారు.
రోశయ్యకు ఆయన నివాళులర్పించారు. రోశయ్య పార్ధీవ దేహంపై పుష్ప గుచ్చం ఉంచి నివాళులర్పించారు. రోశయ్య మృతి తెలుగు రాష్ట్రాలకు తీరని నష్టం అని, ఒక మంచి ప్రజా ప్రతినిధిని సమాజం కోల్పోయిందని వినోద్ కుమార్ అన్నారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోశయ్య ఉన్న సందర్భంలో 2009 డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసే ముందు తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితులను కేంద్రానికి స్పష్టంగా చెప్పిన గొప్ప వ్యక్తి అని వివరించారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.