సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ) : సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన సర్కారు భూమిని ఆక్రమించేందుకు రాత్రికిరాత్రి అక్రమంగా గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఫెన్సింగ్ వేస్తుండటంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని కూల్చివేసిన ఘటన గండిపేట రెవెన్యూ పరిధిలో మంగళవారం రాత్రి తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే… రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట రెవెన్యూ మండల పరిధిలోని ఖానాపురం గ్రామ సర్వే నంబర్ 65లోని సర్కారు భూమికి సంబంధించిన హక్కులన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయంటూ 100 మంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట అక్రమంగా చొరబడి రేకులతో ఫెన్సింగ్ వేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ యంత్రాంగం సకాలంలో స్పందించి ఫెన్సింగ్ను అక్కడ నుంచి తొలగించి ఆక్రమణ దారులను అక్కడ నుంచి ఖానాపూర్ గ్రామస్తుల సహకారంతో తరిమివేశారు. దాదాపు రూ.300 కోట్లకు పైగా విలువ చేసే సర్కారు భూమిని ఆక్రమించుకునేందుకు గత కొన్నాళ్లుగా కొంతమంది వ్యక్తులు యత్నిస్తున్నారంటూ అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఖానాపూర్ గ్రామ దళిత కుటుంబాలకు చెందిన బాధితులు తెలిపారు.
కడప ఎంపీ పేరు చెప్పి..
గత ఏడు దశాబ్దాల నుంచి తమ పూర్వీకులంతా ఇదే భూమిలో జీవనోపాధి కోసం వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించారని, ఈ భూమి తమకే కేటాయించాలంటూ గత కొన్నాళ్లుగా ప్రభుత్వానికి విన్నవించామని వారు తెలిపారు. కోట్ల విలువైన ఈ భూమిని ఆక్రమించుకునేందుకు కడపకు చెందిన ఓ ప్రముఖ ఎంపీ పేరును చెప్పి కబ్జా చేసేందుకు వంద మంది వ్యక్తులు రాత్రిపూట అక్రమంగా ఫెన్సింగ్ వేయడంపై స్థానిక పోలీసులకు సైతం ఫిర్యాదు చేశామన్నారు.
పక్కాగా సర్కారు భూమి : ఉప తాసీల్దార్
ఇదే విషయమై రెవెన్యూ ఉప తాసీల్దార్ను ప్రశ్నించగా సర్వే నంబరు 65 రెవెన్యూ రికార్డులలో పక్కాగా సర్కారు భూమిగా నమోదై ఉందన్నారు. ఈ భూమిని ఇప్పటి వరకు ప్రైవేటు వ్యక్తులెవరికీ సర్కారు కేటాయించలేదని తెలిపారు. కానీ అక్రమంగా కొంతమంది వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించగా తమ సిబ్బంది అడ్డుకొని ఫెన్సింగ్లను కూల్చివేసినట్లు తెలిపారు. నిజంగా సదరు వ్యక్తుల వద్ద ఏవైనా కేటాయించిన పత్రాలు ఉంటే తాసీల్దార్ కార్యాలయానికి వచ్చి చూపాలని కోరారు. అక్రమంగా రాత్రిపూట ఫెన్సింగ్ వేయడం సరికాదని, మరోసారి పునరావృతమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.