వికారాబాద్, నవంబర్ 15 : నూతనంగా మంజూరైన భవిత భవనాల నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ నుంచి పాఠశాల భవనాల మరమ్మత్తులు, యూనిఫాం, డ్రాప్ బాక్స్, విద్యుత్తు, టాయిలెట్స్ తదితర అంశాలపై ఎంపీడీవో, పంచాయతీ రాజ్, ఈడబ్ల్యూఐడీసీ ఏఈలు, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులతో జూమ్ ద్వారా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నూతనంగా మంజూరై పెద్దేముల్, తాండూరు, చౌడాపూర్ మండలాల్లో భవిత కేంద్రాలకు వెంటనే పనులు చేపట్టి పూర్తి చేయాలన్నారు. పాఠశాల భవనాలపై నీరు నిలవకుండా, చెత్త చెదారం లేకుండా చూడాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో పదో తరగతిలో మంచి ఫలితాలు వచ్చేలా విద్యార్థులను సన్నద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
పాఠశాలల్లో ముఖ హాజరు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. మండల విద్యాధికారులు పాఠశాలలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టాలని సూచించారు. వసతి గృహాలు, పాఠశాలలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని పౌరసరఫరా అధికారులను ఆదేశించారు. పాఠశాలలు వసతి గృహాల్లో ఎప్పటికప్పుడు విద్యుత్ సమస్యలను పరిష్కరించుకోవాలనిసూచించారు. సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సుధీర్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఈవో రేణుకాదేవి, పంచాయతీ రాజ్ ఈఈ ఉమేశ్, ఎంఈవోలు పాల్గొన్నారు.