హైదరాబాద్ : మూసివేసే దశలో ఉన్న విజయ డెయిరీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రూ. 700 కోట్ల టర్నోవర్కు చేరుకుందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో విజయ డెయిరీ ఉత్పత్తుల స్టాల్ను శ్రీనివాస్ యాదవ్ ఇవాళ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివస్తున్నారని, వారందరికి విజయ డెయిరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంచాలని ఉద్దేశంతోనే ఈ స్టాల్ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎంతో నాణ్యమైన విజయ డెయిరీ ఉత్పత్తులకు మొదటి నుండి ప్రజాదరణ ఉందన్నారు. గత ప్రభుత్వాలు విజయ డెయిరీని పట్టించుకోలేదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో విజయ డెయిరీ ఎంతో అభివృద్ధి సాధించింది. నూతన ఉత్పత్తులు కూడా అనేకం వచ్చాయన్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని రావిర్యాలలో నూతనంగా మెగా డెయిరీ నిర్మిస్తున్నాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.